శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 24 జూన్ 2015 (20:25 IST)

చేతికి చిక్కితే అంతే...! ముంచి ముంచి చంపుతారు..!! పైగా ఎవరి గోతి వారు తీసుకోవాల్సిందే..!?

ఐఎస్ ఐఎస్ ఉగ్రవాద సంస్థ వెర్రి వెయ్యి దారుల్లో నడుస్తోంది. మానవీయ విలువలు అనే మాట తమ డిక్షనరీలోనే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. తమకు పట్టుబడ్డ వారిని చంపే తీరు చూస్తే ఎందుకీ బతుకు అనిపిస్తుంది. అమ్మో...! అని వళ్ళు గగ్గుర్పొడుస్తుంది. ఈ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా మరణ శిక్షలను అమలు చేస్తున్నారు. కొందరిని నీటిలో ముంచి ముంచి చంపితే.. మరికొందరి కార్లలో పెట్టి గ్రెనేడ్ లాంచర్లతో చంపేస్తున్నారు. పైగా ఎవరి గోతి వారే ముందుగా తవ్విపెట్టుకోవాలి. వీరి పైశాచిక చేష్టలను మళ్ళీ వీడియోల రూపంలో  నెట్ లో పెట్టడం ద్వారా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. 
 
ఇరాక్‌లోని మోసుల్‌లో మరణశిక్షను విచిత్రంగా అమలు చేశారు. అయిదుగురు బందీలను ఓ బోనులో బంధించి స్విమ్మింగ్‌పూల్‌లో ముంచేశారు. వారి మరణావస్థను చిత్రీకరించడానికి నీటిలోపల కెమెరాలను అమర్చారు. వారు ఊపిరాడక చస్తుంటే వాటిని చూసి ఆనందిస్తారు. 
 
మరో తరహా శిక్షలో బందీని లాక్ చేసిన ఓ పాత కారులో బలవంతంగా ఎక్కించి గ్రెనేడ్ లాంచర్‌తో దాన్ని పేల్చివేయడం చేస్తున్నారు. కొందరు బందీల మెడలకు  పేలుడుపదార్థాలున్నగొలుసులు బిగించి డెటోనేటర్లతో బ్లాస్ట్ చేయడం వంటి దారుణ శిక్షలను విధిస్తున్నారు. వీటి తాలూకు వీడియోలను విడుదల చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. 
 
ఇంకో దారుణమైన సంఘటన ఏమిటంటే, ఓ బందీ తన సమాధిని తానే తవ్వుకునేలా ఉగ్రవాదులు ఆదేశించారు. అనంతరం అతడ్ని మట్టుబెట్టారు. అందులోనే పూడ్చిపెట్టారు. బందీలను ఎత్తైన భవనాల నుంచి  కిందికి తోసేసి వారికి మరణ శిక్షలు విధించడం వీరి క్రూరత్వానికి అద్దం పడుతోంది. బహుశా ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి శిక్షలు ఉండవేమో...