1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Ram Mandir donation theft: Cops probe bribe-for-job charge in recruitment drive

లంచాలు తీసుకుని అయోధ్యలో ఉద్యోగాలు.. తవ్వే కొద్దీ అవినీతి మరకలు

Ayodhya Ram Mandir
ప్రఖ్యాత అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం, చోరీ కేసులో తవ్వే కొద్దీ అవినీతి మరకలు, అవకతవకలు బయటపడుతున్నాయి. అయోధ్య మందిరంలో లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చినట్టు తాజాగా వెల్లడైంది. తాజాగా కీలక నిందితుడు అవినాష్‌ శుక్లాను విచారిస్తున్న అధికారుల బృందం మరో కోణంలో అక్రమాలను గుర్తించింది. ఆలయంలో వివిధ పోస్టులకు డబ్బులు తీసుకొని నియామకాలు చేశారని నిందితుడు వెల్లడించినట్లు పోలీసు వర్గాల సమాచారం. దీంతో ఇప్పుడు ట్రస్ట్‌ సభ్యుల్లో కీలకమైన వారిని ప్రశ్నించే అవకాశం ఉంది. 
 
ఆలయంలో దాదాపు 125 మందిని వివిధ పోస్టుల్లో నియమించారు. వీరిలో కొందరి వద్ద నుంచి సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆలయంలో ఉద్యోగుల అపాయింట్‌మెంట్‌ లెటర్లు, ఫార్మల్‌ సర్వీస్ అగ్రిమెంట్లు సహా ఇతర పత్రాలు ఏవీ పోలీసుల చేతికి అందలేదు. దీంతో ఎవరి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయో గుర్తించే పనిలో దర్యాప్తు అధికారులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, వారి లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. నియమకాల తర్వాత ఏమైనా భారీ లావాదేవీలు జరిగాయా? అనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.  
 
ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన అనుకల్ప్‌ మిశ్రా, లవ్‌ కుశ్‌ మిశ్రాకు ఈ నియామకాల అవకతవకల్లో కీలక పాత్ర ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. రామ మందిర విరాళాల దొంగతనం కేసులో అరెస్టు అయిన 8 మంది నిందితులు.. గతేడాది జనవరి, ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సమయంలోనే అత్యధిక మొత్తంలో విరాళాలు దోచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 
 
ఈ క్రమంలోనే నిందితుల ఇళ్లపై బుధవారం మరోసారి అయోధ్య పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యోగా కేంద్రం నుంచి ‘రామరాజ్య కోశ్‌’ అనే పేరుతో ఉన్న విరాళాల హుండీని స్వాధీనం చేసుకున్నారు. దానిపై పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ ఉంది. నిందితుల్లో ఒకరైన అవినాశ్‌ శుక్లా.. ఈ యోగా కేంద్రంలోని ఓ గదిలో గత పదేళ్లుగా నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. ఈ కుంభకోణంలో ఎస్‌బీఐ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిపై దర్యాప్తు చేయాలంటూ ఈడీకి పోలీసులు లేఖ రాసినట్లు సమాచారం. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రూ.35 కోట్ల హార్స్ ట్రేడింగ్