గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (13:29 IST)

డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా ఖాతా ఖతం.. జుకర్ బర్గ్

అమెరికాలోని క్యాపిటల్‌ భవనం వేదికగా జరిగిన హింసాత్మక ఘటనలను ప్రేరేపించేందుకు కారణమైన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా ఖాతాను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వెల్లడించారు. 
 
ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ క్యాపిటల్‌ భవనంపై దాడికి సోషల్‌ మీడియా వేదికగా ట్రంప్‌ ప్రేరేపించడంతో ఆయన మూకలు రెచ్చిపోయి.. విధ్వంస కాండను సృష్టించాయి. అనంతరం కూడా ట్రంప్‌ సోషల్‌ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్‌ చేస్తూ.. మద్దతుదారులను సమర్థించారు. 
 
హింసను ప్రేరేపించే ఉద్దేశంతో చేసినట్లు ఉన్న ట్రంప్‌ ప్రకటనల్ని తాము తొలగించామని జుకర్‌బర్గ్‌ తెలిపారు. వీటితో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు యూట్యూబ్‌ కూడా ఆయన వీడియోను తొలగించింది. స్నాప్‌ చాట్‌ సైతం ఆయన ఖాతాపై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. 
 
ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు ప్రేరేపించడానికి తమ సోషల్‌ మీడియా వేదికను వినియోగించుకునేందుకు తాము విధించిన 24 గంటల నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు జుకెన్‌ బర్గ్‌ ప్రకటన విడుదల చేశారు. 
 
జో బైడెన్‌ ఎన్నికను అధికారికంగా ధ్రువీకరించే సమయంలో జరిగిన దాడి ఘటనలు నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ట్విట్టర్‌ కేవలం 12 గంటలు మాత్రమే నిషేధం విధించింది. జో బైడెన్‌ను అధికార మార్పిడికి అప్పగించేందుకు ఇష్టం లేని ట్రంప్‌.. మిగిలినా ఆయన పదవి కాలాన్ని కుయుక్తులు పన్నేందుకు తమ సంస్థను వినియోగించుకునే అవకాశం ఉందని జుకెన్‌ బర్గ్‌ అభిప్రాయపడ్డారు.