1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. US-Iran Peace Deal: Trump Announces Sunday Signing to Reopen Strait of Hormuz

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం : నేడే సంతకాలు

us iran war
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరనుంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందానికి మొగ్గు చూపడం గమనార్హం. అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరిందని, ఆదివారమే సంతకాలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే, ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకల కోసం తిరిగి తెరుస్తామని ఆయన తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో వెల్లడించారు.
 
"చారిత్రక ఒప్పందంపై రేపు సంతకాలు జరగనున్నాయి. ఆ వెంటనే హర్మూజ్ జలసంధి అందరి కోసం తెరుచుకుంటుంది" అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. గతంలో ఒబామా హయాంలో జరిగిన ఒప్పందంలా కాకుండా, ఈ డీల్ కింద ఇరాన్‌కు ఎలాంటి నగదు చెల్లింపులు లేవని, అణ్వాయుధాలు తయారు చేయకుండా ఇది బలమైన అడ్డంకిగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. 2026 ప్రారంభంలో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే.
 
అయితే, డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ఇరాన్ భిన్నంగా స్పందించింది. చర్చలు తుది దశలో ఉన్నప్పటికీ, ఒప్పందంపై సంతకాల తేదీ ఇంకా ఖరారు కాలేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కొన్ని సాంకేతిక అంశాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, రాబోయే కొద్ది రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ తెలిపారు.
 
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు పాకిస్థాన్, ఖతార్ దేశాలు కీలక మధ్యవర్తిత్వం వహించాయి. రాబోయే 24 గంటల్లో ఒప్పందం ఖరారు కావచ్చని, ఎలక్ట్రానిక్ సంతకాలకు ఏర్పాట్లు చేస్తున్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. 'ఇస్లామాబాద్ మెమోరాండం'గా పిలుస్తున్న ఈ ఒప్పందం ప్రకారం, ఇరు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతుంది. 
 
ఈ సమయంలో ఇరాన్ తన జలసంధిలో అమర్చిన మైన్లను తొలగించనుండగా, అమెరికా.. ఇరాన్ ఓడరేవులపై విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయనుంది. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన చమురు ధరలు దిగివచ్చి, ఆర్థిక వ్యవస్థలకు ఊరట లభించే అవకాశం ఉంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
చందమామపై దిగే ల్యాండర్ల కాలాన్ని పెంచుతాం : ఇస్రో