ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు, ఈ-కామర్స్ వెబ్సైట్స్ తన పేరు, ఫోటోలను వాడుతూ అభ్యంతకరమైన, తప్పుడు సమాచారంతో కూడిన పోస్టులను వ్యాప్తి చేస్తున్నాయంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం విచారణ జరిపింది.
ఎన్టీఆర్ తరపున న్యాయవాది జె.సాయిదీపక్ వాదనలు వినిపించారు. తన క్లయింట్ వ్యక్తిగత హక్కులకు, ప్రతిష్టకు హాని కలిగించేలా ఉన్న పోస్టులను తక్షణమే తొలగించాలని, వాటిని ప్రచారం చేసిన వారిపై 2021 ఐటీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవారని కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు, స్క్రీన్ షాట్లను కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి ముందుగా ఆయా సోషల్ మీడియా సంస్థలను సంప్రదించి పోస్టుల తొలగింపునకు ప్రయత్నించాలని, అ్పటికీ ఫలితం లేకపోతే కోర్టును ఆశ్రయించాలని సూచించారు.
అదేసమయంలో ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీచేసింది. అభ్యంతరకరమైన కంటెంట్ను మూడు రోజుల్లోగా తొలగించాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వచ్చే 22వ తేదీకి వాయిదా వేశారు. సోషల్ మీడియాలో పరువు నష్టంపై ఇటీవల అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తదితర ప్రముఖులు కూడా ఇదే తరహా న్యాయపోరాటం చేసిన విషయం తెల్సిందే.