గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (19:12 IST)

ధోనీ ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఏదో కారణం వుంటుంది.. ఆకాశ్ చోప్రా (Video)

ఐపీఎల్ 2020లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఏడో స్థానంలో వచ్చిన చెన్నై కెప్టెన్ ధోని క్రీజులో కుదురుకున్నాకా మూడు సిక్స్‌లు బాదినా అవి జట్టును గెలిపించలేకపోయాడు. ఇప్పుడు ధోని ఏడో స్థానంలో రావడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

ఏడో స్థానంలో బ్యాటింగ్‌ రావడం పట్ల ధోని కారణం వివరించినా.. ఒక అనుభవజ్ఞుడు చేయాల్సిన పని కాదని పలువురు మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోశారు. అయితే టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం ధోని ఈ విషయంలో కరెక్ట్‌గానే వ్యవహరిస్తున్నాడంటూ అతనికి మద్దతు పలికాడు.
 
ధోని వ్యవహరిస్తున్న తీరు సరిగానే ఉందని ఆకాశ్ చోప్రా అన్నాడు. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నిజానికి ధోని 14 నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. 14 నెలల తర్వాత ప్రాక్టీస్‌ చేసినా అది కొంచెం కొత్తగా కనిపిస్తుంది. 
 
ఇప్పుడు ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ఆడుతున్న ధోని.. వచ్చీ రాగానే బ్యాట్‌కు ఎలా పని చెప్పగలడు. అందుకే తనను తాను బ్యాటింగ్‌లో డిమోషన్‌ కల్పించుకొని ఏడో స్థానంలో వస్తున్నాడు. అంతేగాక దుబాయ్‌కు చేరుకోగానే నేరుగా ప్రాక్టీస్‌ చేయకుండా క్వారంటైన్‌లో ఉండడంతో అతనికి ఎక్కువ ప్రాక్టీస్‌ చేసే అవకాశం లేదు.. అందుకే ఏడో స్థానం అనే నిర్ణయం తీసుకున్నాడు. అయినా ధోని నిర్ణయాలు ఎప్పుడు షాకింగ్‌గానే కనిపిస్తాయి.
 
ధైర్యసాహసాలు, మూర్ఖత్వం మధ్య ఒక సన్నని గీత.. అలాగే జాగ్రత్త, భయం అనే పదాలను వేరు చేసే సన్నని గీతలను  కెప్టెన్‌గా ధోని ఎప్పుడో దాటేశాడు. ఐపీఎల్‌ తొలిదశలోనే ధోని నిర్ణయాలను తప్పుబట్టడం సరికాదు. కేవలం ఒక మ్యాచ్‌ గెలిపించలేకపోయాడనే సాకుతో ధోనిని విమర్శించడం తప్పు.. అతని నాయకత్వ పటిమ ఎప్పటికి చెరిగిపోదు. ధోని తన నిర్ణయాలను ఇప్పుడిప్పుడే అమలు చేస్తున్నాడు.. అయినా ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని మూడు సిక్సర్లు కొట్టాడంటే అతను ఫామ్‌లో ఉన్నట్లేనని ఆకాశ్ చోప్రా అన్నాడు.