శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Munibabu

అద్భుతమైన ఆంధ్రా ఊటీని చూసొద్దాం రండి

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఊటీ ఓ వేసవి విడిదిగా అందరికీ సుపరిచితమే. మరి అలాంటి ఓ వేసవి విడిది ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనే అతి చల్లని ఎత్తైన ప్రదేశం ఉన్న ప్రాంతంగా పేరుతెచ్చుకున్న దానిపేరే హార్సీలీ హిల్స్. తూర్పు కనుమలలోని దక్షిణ భాగపు కొండలైన హార్సిలీ హిల్స్‌లో ప్రకృతి అందాలకు ఏమాత్రం కొదవలేదంటే అది అతిశయోక్తి కాదు.

హార్సిలీ హిల్స్ విశేషాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఓ చక్కని వేసవి విడిదిగా పేరుతెచ్చుకున్న హార్సిలీ హిల్స్‌లో చలికాలం ఉష్ణోగ్రత కేవలం మూడు డిగ్రీలే ఉంటుంది. అదే వేసవిలో దాదాపు 32 డిగ్రీల సెంటీగ్రేడ్‌తో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఓ చక్కని వేసవి విడిదిగా హార్సిలీహిల్స్ పేరుతెచ్చుకుంది.

అసలు హార్సిలీ హిల్స్ బ్రిటీష్‌వారి కాలం నుంచే వేసవి విడిదిగా ఉండడం విశేషం. బ్రిటీష్ హయాంలో 1863 నుంచి 67 మధ్యకాలంలో డబ్ల్యూ.హెచ్. హార్సిలీ అనే అధికారి ఈ ప్రాంతంలో కలెక్టర్‌గా పని చేశారు. ఆయనే తొలిసారిగా ఇక్కడ ఓ వేసవి విడిది కట్టించారు. దీనిని అప్పట్లో ఫారెస్ట్ బంగ్లా అని పిలిచేవారు.

అటుపై ఇక్కడ బ్రిటీష్‌వారు ఓ కార్యాలయ భవనాన్ని కూడా నిర్మించారు. ఇలా హార్సిలీ హిల్స్ ప్రాంతంలో బంగ్లా నిర్మించిన హార్సిలీ గౌరవార్ధం ఫారెస్ట్ బంగ్లాలోని నాలుగు గదుల్లో ఓ దానికి హార్సిలీ పేరు పెట్టారు.

హార్సిలీ హిల్స్‌లో చూడాల్సినవి
హార్సిలీ హిల్స్‌లో చూడదగ్గ ప్రదేశాలు తక్కువే అయినా ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం ప్రధానంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. అలాగే హార్సిలీ హిల్స్ చేరడానికి వెళ్లే కొండదారి ప్రకృతి అందాలతో మనకు ఆహ్లాదాన్ని కల్గిస్తుంది. ఈ దారి పొడవునా చాలా ఏళ్లనాటి మహా వృక్షాలు మనసు ఆహ్లాదాన్ని కల్గిస్తాయి.


వీటితోపాటు ఈ అటవీ ప్రాతంలో కొన్ని రకాల వన్యప్రాణులు సైతం సంచరిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ప్రకృతి అందాల తర్వాత హార్సిలీ హిల్స్‌లో చూడాల్సిన ప్రదేశాలు ఓ మూడు, నాలుగు ఉన్నాయి. దాదాపు 142 ఏళ్ల వయసు కలిగిన భారీ యూకలిప్టస్ చెట్టు హార్సిలీ హిల్స్‌కే ప్రత్యేక ఆకర్షణ.

దీని తర్వాత జూ పార్క్‌గా పేరున్న వన్యమృగ సంరక్షణ కేంద్రం మరో చూడదగ్గ ప్రదేశం. దీని తర్వాత గవర్నర్ బంగ్లా, జిడ్డు కృష్ణమూర్తి నెలకోల్పిన రిషివ్యాలీ విద్యాలయం పర్యాటకులకు మధురానుభూతిని మిగులుస్తాయి.

హార్సిలీ హిల్స్‌కు ప్రయాణం
చిత్తూరు జిల్లా మదనపల్లెకు దగ్గరగా ఈ హార్సిలీ హిల్స్ ప్రాంతం ఉంది. దీని అసలు పేరు ఏనుగు మల్లమ్మ కొండ. చిత్తూరు జిల్లాలోని ప్రధాన పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో హార్సిలీ హిల్స్ ఉంది. ఇక్కడకు వెళ్లేందుకు అన్ని రకాల వాహన సదుపాయం అందుబాటులో ఉన్నాయి. అలాగే హార్సిలీ హిల్స్‌లో పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.