బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Ganesh

"కుమావన్"లో దేవతలు నివాసం ఉండేవారట..!

FILE
ఆకాశాన్ని అంటుతున్న హిమాలయా పర్వతాలు ఓవైపు.. వాటి నుంచి జాలువారే సెలయేర్లు మరోవైపు.. ఆ పర్వత సానువుల మీద ఆకాశంలోకి ఏపుగా పెరుగుతూ.. ఒకదాని ప్రక్కన మరొకటిగా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా దర్శనమిచ్చే ఫైన్ చెట్ల అందాలు.. ఎన్నెన్నో లోయలు.. ఆ లోయలనిండా రంగు రంగుల పుష్పాలు.. వెరసీ "కుమావన్ పర్వతాలు".

భారతావనికి ఉత్తరాదిన పెట్టని కోట గోడల్లాగా ఉండే హిమాలయా పర్వతాలను భారతీయులు అత్యంత పవిత్రమైనవిగా పూజిస్తుంటారు. ఈ హిమ పర్వతాల్లో దేవతలు నివాసం ఉంటారని హిందువుల నమ్మకం. హనుమంతుడు నేటికీ హిమాలయాల్లో ఉన్నాడని విశ్వసిస్తుంటారు కూడా..! ఇక పరమశివుడి కైలాస పర్వతం సైతం ఇక్కడే ఉంది.

అలాగే.. పవిత్ర నదులైన గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర నదుల జన్మస్థానం కూడా హిమాలయా పర్వాతాల్లోనే..! పవిత్ర రుద్రాక్షలను అందించే మొక్కలతో పాటు వందలాది ఔషధ మొక్కల నిలయం కూడా హిమాలయాల్లోనే. హైందవ పురాణాలన్నింటిలోనూ హిమాలయాల ప్రాశస్త్యం వర్ణించబడింది.

ఆ సంగతలా ఉంచితే.. హిమాలయా పర్వతాలను పలు శ్రేణులుగా విడగొట్టి పిలుస్తుంటారు. వాయువ్యంలో కాశ్మీర్ మొదలుకుని ఈశాన్య భారతదేశం వరకు విస్తరించిన ఈ హిమాలయా పర్వతాలలో పైన మనం చెప్పుకున్న "కుమావన్ ప్రాంతం" అత్యంత సుందరమైనది. ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ కుమావన్ పర్వతాలలో హిమాలయాలలోనే అత్యంత పవిత్రమైనవిగా చెప్పబడే పుణ్యక్షేత్రాలున్నాయి.

కాశ్మీరీ అందాలకు సాటిగా నిలిచే లోయ ఒకటి కుమావన్ పర్వతాలలో ఉంది. అదే "సౌర్ లోయ". ఆ లోయనుంచి ఎటు చూసినా పచ్చటి ప్రకృతే మనకు దర్శనమిస్తుంది. ఎత్తుగా లేచి నిలబడ్డట్లుగా ఉండే పర్వతాలు, ఆ పర్వతాల మధ్య పాము మెలికలను పోలిన కాలిబాటలు, ఆ బాటల వెంట ప్రయాణం చేస్తుంటే అడగడుగా ఓ దేవతా మందిరం.. ఇలా వర్ణించేందుకు వీలులేనంతటి విశేషాలను తనలో దాచుకున్నదే "కుమావన్".

FILE
ప్రకృతి దేవతల ప్రతిరూపాలను ఇక్కడి కొండలు, గుట్టలు, లోయలలో ప్రతిష్టించారు. ఈ లోయల్లో ఉండే అలాంటి మందిరాల్లో ఒకటైన "చితాయ మందిరం" ముందు వందలకొద్దీ గంటలు వేలాడగట్టబడి ఉంటాయి. అక్కడి దేవతకు మన కష్టాలను విన్నవించుకునేందుకు కాగితాలను వాడతారు. తమ కోరికలను ఆ కాగితాలపై రాసి.. గంటతో సహా మందిర ప్రాంగణంలో వేలాడదీస్తారు. ఇలా చేస్తే.. ఆ దేవత తమ విన్నపాలను తప్పనిసరిగా మన్నిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

ప్రకృతి సహజంగా ఏర్పడిన 48 సరస్సులు కుమావన్ పర్వతాల అందాలను మరింత ద్విగుణీకృతం చేసేలా ఉంటాయి. ప్రతి పర్వతం మధ్యన ఒక సరస్సు ఉంటుంది. ఆ పర్వతం మీద పడిన వర్షపు నీరు, కరిగిన మంచు సరస్సును చేరతాయి. ఆ సరస్సుల్లో అత్యంత స్వచ్ఛమైన నీరు, ఆ నీటిలోపల చుట్టూ ఉన్న ప్రకృతి అందాల ప్రతిబింబం గోచరిస్తూ.. కళ్లకు విందు చేస్తుంటుంది.

కుమావన్ మొత్తం 73 పర్వతాలను కలిగి ఉంది. ప్రతి పర్వతం నేరుగా ఆకాశంలోకి చొచ్చుకుని వెళుతున్న పదునైన ఖడ్గంలాగా రూపుదిద్దుకుని ఉంటుంది. వీటితోపాటు 17 హిమఖండాలున్నాయి. ఇలాంటి ప్రకృతి మధ్య దేవతలు కాకుండా మనుషులెందుకు ఉంటారు చెప్మా అనిపించకమానదు సుమా..!

FILE
అందుకేనేమో...! ఇంత అందమైన ప్రదేశాన్ని దేవతలు తమకోసం నిర్మించుకున్నారు కాబట్టి, వారికి ఏ మాత్రం ఇబ్బంది కలిగించని విధంగా తాము మసలుకోవాలని స్థానికులు తమకు తాముగా ఓ నిబంధనను విధించుకున్నారు. అందుకే కుమావన్ కొండచరియల ప్రతి మలుపులోనూ ఒక దేవాలయం దర్శనమిస్తుంది. అలా మొత్తంగా 40 శైవ మందిరాలు, మరో 48 దేవీ మందిరాలు పూజలందుకుంటున్నాయి.

కుమావన్ వన్యప్రాణులకు కూడా నిలయమే. పక్షులను ప్రేమించేవారికి ఇది ఓ రకమైన స్వర్గమే. ఇక్కడ కనిపించే పక్షులు దాదాపుగా 300 రకాల జాతులకు పైచిలుకే. పక్షుల ముక్కులు, పక్షుల రంగులు, ఈకలు.. చూస్తే అసలింత వైవిధ్యంగా ఉండటం మరెక్కడైనా సాధ్యమా అనిపించక మానదు. ఉదయం, సాయంత్రపు వేళల్లో ఆ పక్షుల కిలాకిలారావాలు చెవులకు విందు చేస్తాయి.

పక్షులతో పోటీపడి రంగులు వెదజల్లే సీతాకోక చిలుకలకు కూడా ఈ దేవతల భూమే నిలయం. ఈ సుందర వనాలలో విహరించేందుకు దిగివచ్చిన దేవకన్యల్లా ఉంటాయవి. అక్కడ వీచే గాలులకు పరవశిస్తూ, అలా విహరిస్తూ, ఒక్కో పూవునుంచి మరో పూవుకు మకరందం కోసం ఆ సీతాకోక చిలుకలు కళ్లకు పసందు చేస్తూ, మనసుకు హాయినిస్తాయి.

FILE
దాదాపు 3వేల మీటర్ల ఎత్తు ఉండే ఈ కుమావన్ పర్వత శ్రేణులలో పలు వన్యప్రాణి రక్షిత ప్రదేశాలున్నాయి. వాటిలో దాదాపు 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న "బిస్సార్" రక్షిత ప్రదేశం విశేషమైనది. ఈ ప్రాంతంలో ఇది ఒక సౌందర్య ప్రాంతం. ఇక్కడ చిరుతలు, కస్తూరి మృగాలు, జింకలు, భల్లూకాలవంటి ఎన్నో వన్యప్రాణులు విహరిస్తుంటాయి.

అలాగే మంచుతో కప్పబడి ఉండే పర్వతాలలోని "గోవింద వన్యప్రాణి సంరక్షిత ప్రదేశం" కూడా చూడదగ్గదే. ఇక్కడ హిమాలయాలకు మాత్రమే పరిమితమైన నల్ల భల్లూకం, మంచు చిరుత, కస్తూరు, కోళ్ల వంటి పక్షులు, తాహిర్‌లు కనువిందు చేస్తాయి. ఇక్కడి పర్వతాలలో స్వరరోహిణి, నల్లశిఖరం అనేవి ప్రత్యేకంగా చూడదగ్గవి.

ఇంతటి ప్రకృతి విశేష ప్రదేశాలను తనలో దాచుకుని.. అలకానంద, మందాకిని, గంగ, యమునా నదుల పుట్టినిల్లుగా భాసిల్లుతున్న ఈ ప్రదేశం నేడు విధ్వంసానికి గురవుతోంది. అభివృద్ధి పథకాల పేరుతో కొంతమేరకు అడవులను ధ్వంసం చేయగా.. కలప కోసం మరికొంత అడవిని నాశనం చేస్తున్నారు. ఫలితంగా ఈ దేవతల భూమి నేడు జీవులపాలిట మరుభూమిగా మారిపోతోంది.

దేవతల భూమిగా పిలిచే కుమావన్ అందాలు నేడు మానవుడి ఆక్రమణకు గురైన ఉత్తరాంచల్‌లో లేనట్లే..! ఈ ప్రాంతంలోని చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లి వచ్చేవారికి అక్కడి పరిస్థితులు బాగానే అర్థమవుతాయి. అత్యవసర చర్యలు చేపట్టి ఇక్కడి ప్రకృతిని గనుక కాపాడుకోనట్లయితే.. రుద్ర ప్రయాగ, గంగోత్రి, యమునోత్రి, బదరీ, కేదారనాథ్ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల అందచందాలను, వాటి పవిత్రతను, అక్కడి ప్రకృతి సహజ సౌందర్యాన్ని శాశ్వతంగా కోల్పోతాం. కాబట్టి కుమావన్ ప్రాంతాన్ని మన వారసత్వంగా కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత.