మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Ganesh

చూపు తిప్పుకోనీయని హిల్ స్టేషన్ "ఖండాలా"

FILE
భారతదేశంలోని ప్రధాన హిల్ స్టేషన్లలో "ఖండాలా" ఒకటి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహారాష్ట్ర రాష్ట్రానికి పశ్చిమ దిశలో ఎత్తైన కొండలతో, చూపుతిప్పుకోనీయని పచ్చని ప్రకృతి సౌందర్యంతో ఈ ప్రాంతం పర్యాటకుల మనసు దోచుకుంటోంది. ముంబై మహా నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో, 625 మీటర్ల ఎత్తులో కొలువైయున్న ఖండాలాలో ట్రెక్కింగ్ చేసేందుకు దేశ, విదేశీ పర్యాటకులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు.

చిన్నది మరియు అందమైన ఈ ఖండాలా హిల్‌ స్టేషన్‌లో కనుచూపుమేరా పచ్చని ప్రకృతి మినహా మరేమీ కనిపించదు. ప్రకృతి ప్రేమికులకు, మరియు కొత్త జంటలకు, లవర్స్‌కు స్వర్గధామంలా అనిపించే ఈ ప్రాంతం అద్భుత అందాల పర్వత ప్రాంతంగా గుర్తింపు పొందుతోంది.

గతంలో ఖండాలా చత్రపతి శివాజీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అనంతరం బ్రిటీష్ వారి పాలన వచ్చాక... దక్కన్ పీఠభూమి మరియు కొంకణ్ మైదానాల మధ్య గల రోడ్డు మార్గంలో గల భోర్‌ఘాట్‌లో భాగమయ్యింది. బోర్ ఘాట్‌కు ఆ కాలంలో రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలను కలిగి ఉండేవి. ముంబై-పూణే ఎక్ర్స్‌ప్రెస్ రైలు మార్గం, అలాగే ముంబై మరియు పూనేలకు రైలు మార్గం ఖండాలా ద్వారానే సాగేది.

అదలా ఉంచితే.. ఖండాలాకు 5 కిలోమీటర్ల దూరంలో "లోనవాలా" అనే మరో ప్రఖ్యాత హిల్ స్టేషన్ కూడా చూడదగ్గది. ఖండాలాకంటే పెద్దదైన ఈ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కళ్లు తిరిగే లోయలు ఓవైపు, ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండే పర్వతాలు మరోవైపు.. తుగవులి, లోనావాలా మరియు భుషి సరస్సుల హొయలు.. ఇలా లెక్కలేనన్ని ప్రకృతి సౌందర్య విశేషాలతో లోనావాలా అలరారుతుంటుంది.

ఖండాలాకు 16 కిలోమీటర్ల దూరంలో కొలువైయున్న కర్ల మరియు భజా గుహలు కూడా తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశాలు. ఈ రాతి గుహల్లోని రాతి ఆలయాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. బౌద్ధమతానికి చెందిన హీనయానశాఖవారు ఈ రాతి గుహాలయాలను నిర్మించినట్లు తెలుస్తోంది. అలాగే ఇక్కడికి దగ్గర్లోని అమృతాంజన్ పాయింట్‌ కూడా తప్పక చూడాల్సిందే.

FILE
ముంబయి నుంచి ఖండాలా ప్రయాణ మార్గంలో కూడా అనేక దర్శనీయ ప్రాంతాలు కానవస్తాయి. ఇలాంటి వాటిలో చారిత్రకమైన కోటలు, జలపాతాలు, సరస్సులు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది రాజ్‌మాచి పార్క్ ఒకటి. ముంబయి నుంచి లోనవాలాకు వెళ్లే మార్గమధ్యంలో పర్వతాలు ప్రారంభమయ్యేచోట అందమైన ఓ ఉద్యానవనం, రజ్ మాచి కోట గోపురాలు దర్శనమిస్తాయి.

దాని దిగువ భాగంలో అతి పెద్ద లోయ ఉంటుంది. ఆ లోయలోనే ఒక దేవాలయంతోపాటు హోటల్ కూడా ఉంటుంది. దానికి దగ్గర్లోనే చిన్నపిల్లల ప్రత్యేకంగా రూపొందించిన పార్క్ ఒకటి ఉంటుంది. దాని తరువాత వంద అడుగుల ఎత్తునుంచి కిందికి దుమికే కునే జలపాతాలు కూడా చూడదగ్గవే. ఇవి ఖండాలాకు లోనవాలాకు మధ్యలో ఉన్నాయి.

పైన చెప్పుకున్న ప్రాంతాలతోపాటు టైగర్స్‌లీప్, సాకుర్ ప్లాటియా, మంకీ హిల్, లోహ‌గాడ్ దర్శన్, శివాజీ పార్క్, డ్యూక్స్‌నోస్ లాంటి అనేక పర్యాటక ప్రాంతాలు చూడదగ్గవే. ఖండాలాలో వాతావరణం మే నెల వరకూ చల్లగానే ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచక్కా సందర్శించవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంత సందర్శనకు అక్టోబర్-మే మాసాల మధ్యకాలం అయితే బెటర్.

ఖండాలా ఎలా వెళ్లాలంటే... ఖండాలాలో ఎయిర్‌పోర్టు లేని కారణంగా, దానికి దగ్గర్లోని పూణే వరకు విమానంలో ప్రయాణించి వెళ్లవచ్చు. పూనే వరకు విమానంలో వచ్చి దిగాక, అక్కడికి దగ్గర్లోని రైలు మార్గం ద్వారా 69 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే లోనవాలా రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. లోనవాలాలో ముంబై-పూనే రైలు మార్గంలో ప్రయాణించే రైళ్లన్నీ అందుబాటులో ఉంటాయి.

కాగా.. లోనవాలా నుంచి ముంబై చేరేందుకు కేవలం 3 గంటల సమయం సరిపోతుంది. అదే విధంగా లోనవాలా నుంచి పూనే వెళ్లాలంటే మాత్రం నాలుగు గంటలు ప్రయాణించాల్సిందే. ఇక బస్సు సౌకర్యం విషయానికి వస్తే.. ముంబై-పూనే మార్గంలో ఖండాలాకు అనేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.