శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Pavan Kumar
Last Modified: బుధవారం, 21 మే 2008 (17:49 IST)

ప్రకృతి రమణీయ ప్రాంతం త్రిపుర

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర ప్రకృతి రమణీయతతో అలరారుతుంది. ఈశాన్య కొండలపై త్రిపుర రాష్ట్రం ఉంది. పచ్చని కొండలతో పాటుగా అనేక వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలకు నిలయం త్రిపుర. త్రిపుర రాజధాని అగర్తలా. త్రిపుర 1949కి ముందు ప్రత్యేక రాజ్యంగా ఉండేది. స్వాంత్రంత్యం వచ్చిన తర్వాత అంటే 1949లో భారతదేశంలో విలీనమయింది.

శక్తి పీఠాల్లో ఒకటైన త్రిపుర సుందరీ దేవి దేవాలయం రాజధాని అగర్తాలకు సమీపంలోని ఉదయ్‌పూర్‌లో ఉంది. అగర్తలా-ఉదయ్ పూర్ మధ్య దూరం 55 కి.మీ.. త్రిపురలో ప్రధాన నది మనూ ఒకటి.

త్రిపురలో మొత్తం నాలుగు జిల్లాలు ఉన్నాయి. ధలాయ్ జిల్లాకు రాజధాని అంబస్సా, ఉత్తర త్రిపురకు కైలాషాహార్, దక్షిణ త్రిపురకు ఉదయ్‌పూర్, పశ్చిమ త్రిపురకు అగర్తలా.

అగర్తలా
రాజధాని అగర్తలాలో ఉజ్జయంత ప్యాలెస్, కుంజాబన్ ప్యాలెస్, స్టేట్ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం, సుకంతా అకాడమీ, లక్ష్మీనారాయణ్ దేవాలయం, ఉమా మహేశ్వర్ దేవాలయం, జగన్నాధ్ దేవాలయం, రబీంద్ర కనన్, పుర్బాషా, పోర్చుగీస్ చర్చ్ వంటివి ఉన్నాయి.

ఉజ్జయంతా ప్యాలెస్‌ను మహారాజా రాధా కిషోర్ మాణిక్య 1899-1901 సంవత్సరాల మధ్య కట్టించారు. ఇది రెండస్థుల భవనం. ప్యాలెస్ ముందు భాగంలో మొఘల్ తరహా గార్డెన్స్‌ను ఒకదానిని ఏర్పాటుచేశారు. ఉజ్జయంతా ప్యాలెస్ అందాలను రాత్రిపూట తిలకించటానికి వీలుగా ఫ్లడ్ లైటింగ్ సిస్టంను అమర్చారు. ప్రస్తుతం ఇది త్రిపుర శాసనసభ భవనం.

కుంజాబన్ ప్యాలెస్‌ను మహారాజా బీరేంద్ర కిషోర్ మాణిక్య 1917లో నిర్మించారు. దీనికి ఆ తర్వాత పుష్పబంతా ప్యాలెస్‌గా నామకరణం చేశారు. విశ్వకవి రవీంద్రనాధ్ టాగోర్ త్రిపుర పర్యటనకు 1926లో వచ్చినపుడు ఇక్కడే నివాసం ఉన్నారు. వీటితోపాటుగా వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు త్రిపురలో ఉన్నాయి.

త్రిపుర సుందరీ ఆలయం
అగర్తాలకు 55 కి.మీ. దూరంలోని ఉదయ్‌పూర్‌లో త్రిపుర సుందరీ ఆలయం ఉంది. దుర్గా అమ్మవారి 51 శక్తి పీఠాల్లో ఒకటి ఉదయ‌పూర్ త్రిపుర సుందరీ ఆలయం. బెంగాలీ వాస్తు శిల్పిని అనుసరించి దేవాలయాన్ని కట్టారు. మహారాజా ధాన్య మాణిక్య ఈ దేవాలయాన్ని 1501 సంవత్సరంలో కట్టించారని అంటారు.

ఎలా చేరుకోవాలి
విమాన మార్గం : రాజధాని అగర్తలాలో విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి కోల్‌కతా, గౌహతి, సిలిచార్‌లకు ప్రతిరోజూ విమాన సేవలు ఉన్నాయి.

రహదారి మార్గం : గౌహతి 599 కి.మీ., షిల్లాంగ్ 499 కి.మీ., సిలిచార్ 288 కి.మీ., ధర్మానగర్ 200 కి.మీ. గౌహతి నుంచి త్రిపుర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు సేవలను అగర్తలాకు నడుపుతుంది.

రైలు మార్గం : సమీపంలోని రైల్వే స్టేషన్ ధర్మానగర్. అగర్తలా నుంచి 200 కి.మీ. దూరంలో ధర్మానగర్ ఉంది. ధర్మానగర్-లుండింగ్ మధ్య మీటర్ గేజి రైలు రాకపోకలు ఉన్నాయి. రైలు ప్రయాణం చాలా సమయం తీసుకుంటుంది. ఇది అంత అనుకూలం కాదు. ధర్మానగర్-అగర్తలా మధ్య రైలు మార్గం నిర్మాణంలో ఉంది. ధర్మానగర్-అంబస్సాల మధ్య రైలు మార్గ నిర్మాణం పూర్తైంది.

వసతి

ప్రభుత్వం, ప్రైవేటు రంగాలకు చెందిన అనేక హోటెళ్లు అగర్తాలలో ఉన్నాయి.