శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (13:00 IST)

రిపబ్లిక్‌ డే: రైతుల ట్రాక్టర్ ర్యాలీ భగ్నానికి పాక్ ఉగ్రవాదుల కుట్ర

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు రిపబ్లిక్‌ డే సందర్భంగా మంగళవారం తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీని భగ్నం చేసేందుకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, ఖలిస్తాన్‌ సంస్థలు కుట్ర పన్నాయని పోలీస్‌ వర్గాలు హెచ్చరించాయి. ట్రాక్టర్‌ ర్యాలీలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్ర మూకలు భారీ కుట్రకు తెరలేపాయని, ఈ శక్తుల ఆగడాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతు సంఘాలకు సూచించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 
 
ప్రభుత్వంతో రైతు సంఘాల చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో ట్రాక్టర్‌ ర్యాలీకి రైతులు పిలుపునిచ్చిన క్రమంలో ర్యాలీని దెబ్బతీసే లక్ష్యంతోపాకిస్తాన్‌ నుంచి 300 ట్విట్టర్‌ ఖాతాలు ఏర్పాటైనట్టు గుర్తించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
 
నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే వేర్పాటువాద సంస్థ వీడియో ఆధారంగా పవర్‌ స్టేషన్లు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉందని వెల్లడవడంతో దేశ రాజధాని అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. కిసాన్‌ ర్యాలీలో వేర్పాటువాద నేత జర్నైల్‌ సింగ్‌ బింద్రన్‌వాలే పోస్టర్లను ప్రదర్శిస్తారని పోలీసులకు సమాచారం అందింది. 
 
ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు భగ్నం కల్పించబోమని రైతు సంఘాల నుంచి హామీ తీసుకున్న అనంతరం ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొనేందుకు దేశ రాజధానిలోకి రైతులను అనుమతించేందుకు ఢిల్లీ పోలీసులు ఆదివారం అనుమతించారు. కిసాన్‌ ర్యాలీ సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.