ఆధార్ కార్డులో సవరణలు.. ఇకపై సేవా కేంద్రాలకు వెళ్లనక్కర్లేదు.. ఇంటి నుంచే మార్పులు
ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్త. ఆధార్ కార్డులోని వివరాలను సవరించుకోవడానికి ఇకపై సేవా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా, ఇంట్లో నుంచే మార్పులు చేసుకునేందుకు వీలుగా ఒక కొత్త మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీతో పనిచేసే ఈ యాప్ ద్వారా కీలకమైన వివరాలను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు.
మొబైల్ నంబర్తో పాటు పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ వంటి ఇతర వివరాలను మార్చుకునే సదుపాయాలు కూడా ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని, త్వరలోనే వాటిని కూడా అందుబాటులోకి తెస్తామని యూఐడీఏఐ అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానంతో ఆధార్ కేంద్రాలపై భారం తగ్గి, ప్రజలకు సేవలు మరింత వేగంగా అందనున్నాయి.
ప్రస్తుతం ఈ కొత్త యాప్లో మొబైల్ నంబర్ను మార్చుకునే సదుపాయాన్ని యూఐడీఏఐ లైవ్ చేసింది. వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లో ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని, ఫేస్ అథెంటికేషన్ ద్వారా తమ గుర్తింపును ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాత రూ. 75 ఫీజు చెల్లించి కొత్త మొబైల్ నంబర్ను అప్డేట్ కోసం రిక్వెస్ట్ పంపవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సుమారు 30 రోజుల్లోగా కొత్త నంబర్ ఆధార్తో లింక్ అవుతుంది.