అనంత్ అంబానీ కోసం జాకబ్ అండ్ కో ప్రత్యేక వాచ్.. ధర ఎంతో తెలుస్తే నోరెళ్లబెడతారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ కోసం జాకబ్ అండ్ కో ప్రత్యేక వాచ్ను తయారు చేసింది. దీనికి ఆపరా వంతార గ్రీన్ కామోగా నామకరణం చేశారు. దాదాపు 400 రత్నాలు, వజ్రాలు పొదిగి, పచ్చటి అడవిని తలపించేలా ఈ వాచ్ ఉంది. ఇది వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్ర స్ఫూర్తితో రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఈ వాచ్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ గడియారం ధర 1.5 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో రూ.12.5 కోట్లు. ఇది కేవలం ఒక వాచ్ మాత్రమే కాదు, అనంత్ వన్యప్రాణి సంరక్షణ అభిరుచికి, ఆయన కలల ప్రాజెక్ట్ 'వంతార'కు ప్రతిబింభంగా నిలుస్తోంది.
ఈ వాచ్ రూపకల్పన అద్భుతంగా ఉంది. వాచ్ డయల్ మధ్యలో చేతితో చిత్రించిన అనంత్ అంబానీ చిన్న బొమ్మను అమర్చారు. దీనికి ఇరువైపులా ఒక సింహం, ఒక బెంగాల్ పులి సూక్ష్మమైన ప్రతిమలు ఉన్నాయి. ఇవి వంతార ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాన్ని సూచిస్తాయి. దాదాపు 400 రత్నాలు, వజ్రాలు పొదిగి, పచ్చటి అడవిని తలపించేలా ఈ వాచ్ను రూపొందించారు. ఇందులో డిమాంటోయిడ్ గార్నెట్స్, సావొరైట్స్, గ్రీన్ సఫైర్స్ వంటి విలువైన రాళ్లను ఉపయోగించారు. ఈ రత్నాల మొత్తం బరువు 21.98 క్యారెట్లు.
జాకబ్ అండ్ కో 'ఆపరా' సిరీస్లో భాగంగా వచ్చిన ఈ వాచ్, సమయం చూపడంతో పాటు తిరిగే యంత్ర భాగాలు, సంగీతాన్ని వినిపించే ప్రత్యేకతలను కూడా కలిగి ఉంది. గుజరాత్ లోని జామ్ నగర్లో 3,500 ఎకరాల్లో ఏర్పాటు చేసిన వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం స్ఫూర్తితోనే ఈ గడియారాన్ని డిజైన్ చేశారు. ఈ కేంద్రంలో అత్యాధునిక వెటర్నరీ ఆసుపత్రులు, 1,50,000 పైగా జంతువులు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ గడియారంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు దీని అద్భుతమైన పనితనాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు దీని ఖరీదుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంపద ప్రదర్శనతో పాటు ఒక ఆశయానికి ప్రతీకగా నిలిచే ఇలాంటి విలాసవంతమైన వస్తువులు నేటి సంపన్నులను ఆకర్షిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.