అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు
శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కేరళ అటవీశాఖ అధికారులు ఓ కీలక సూచన చేశారు. అయ్యప్ప సన్నిధానానికి సమీపంలో ఉన్న ఉరళ్కుళి జలపాతాన్ని సందర్శించవద్దని కోరింది. ఆ జలపాతం వద్ద వన్యప్రాణుల ముప్పు పొంచివుందని హెచ్చరించింది. భక్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ అడ్వైజరీని జారీచేస్తున్నట్టు సన్నిధానం స్పెషల్ డ్యూటీ రేంజ్ ఆఫీసర్ అరవింద్ బాలకృష్ణన్ తెలిపారు.
కాగా, శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే కొందరు భక్తులు ఉరళ్కుళి జలపాతం వద్ద స్నానం చేస్తుంటారు. ఆ తర్వాత వారు స్వామి వారి దర్శనం కోసం వెళుతుంటారు. పండితవాళానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం వద్ద ఇటీవల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఈ ప్రాంతంలోకి ప్రవేశం పూర్తి నిషేధమన్నారు.
ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తూ ఉంటుందని, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఈ జలపాతానికి దూరంగా ఉండాలని భక్తులకు సూచించారు. జలపాతానికి వెళ్లే మార్గం కూడా జారే స్వభావం ఉండడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. కాబట్టి శబరిమల వచ్చే భక్తులు ఈ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని బాలకృష్ణన్ కోరారు.