1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Banda horror: Father allegedly kills daughter over love marriage during counselling

ప్రేమించి పెళ్లి చేసుకుందని కన్నతండ్రే కుమార్తెను కడతేర్చాడు.. అందరూ చూస్తుండగా..?

Crime
ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో కన్నతండ్రి మృగంలా ప్రవర్తించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ స్టేషన్ ఆవరణలోనే అందరూ చూస్తుండగా కూతురిపై కత్తితో ఘాతుకానికి ఒడిగట్టాడు. తీవ్ర గాయాలపాలైన సదరు యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
 
వివరాల్లోకి వెళితే.. బదౌసా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్చా గ్రామానికి చెందిన 19 ఏళ్ల శివాని, అదే ప్రాంతానికి చెందిన లలిత్ అనే యువకుడిని ప్రేమించింది. మే 18న వీరిద్దరూ ఇళ్లనుంచి వెళ్ళిపోయి ఒక ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, లలిత్ తన కుమార్తెను ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశాడంటూ శివాని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు లలిత్, శివానిల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు జూన్ 12న వారిని కనిపెట్టారు. సమాచారం అందుకున్న ఇరు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల విచారణలో 19 ఏళ్ల శివాని తాను మైనర్‌ను కాదని, స్వచ్ఛందంగానే లలిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, తన భర్తతోనే కలిసి జీవిస్తానని తేల్చి చెప్పింది. 
 
ఈ మాటలు విన్న ఆమె తండ్రి సత్యకుమార్ అవమానంతో, తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తను వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో అందరూ చూస్తుండగానే శివానిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన శివానిని సమీప కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘోరానికి పాల్పడిన తండ్రి సత్యకుమార్‌ను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేసి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
About Writer
సెల్వి