బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (16:06 IST)

14 సంవత్సరాల పాటు అడవిలో కారులోనే జీవనం: బుట్టలు అమ్ముకుంటూ..?

రుణం చెల్లించకపోవడంతో.. సమాజానికి దూరమైన ఆ వ్యక్తి 14 సంవత్సరాల పాటు కారులోనే జీవనం సాగించాడు. అడవిలో పాత కారునే అద్దాల మేడగా భావించి అక్కడే వుండిపోయాడు. మంగళూరు సులియా తాలూకాలో నూజలు గ్రామస్థుడు చంద్ర శేఖర్ గౌడకు 2.29 ఎకరాల భూమి ఉంది. దానిపై 1999లో నెల్లూర్ కేమరాజే కోఆపరేటివ్ సొసైటీలో రూ.54 వేలు పంట రుణం తీసుకున్నాడు. 
 
రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో సొసైటీ 2002 అక్టోబరులో రూ.1.2 లక్షలకు అతని భూమిని వేలం వేసింది. రుణం మొత్తాన్ని తీసుకొని, మిగిలిన రూ.11 వేలను చంద్రశేఖర్ పేరుపై ఉంచింది. కానీ ఆ సొమ్మును తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అతని మానసిక స్థితి బాగా దెబ్బతింది. కొంతకాలం తన సోదరితో కలిసి జీవించాడు. ఆ తర్వాత సెకెండ్ హ్యాండ్ ఫియర్ కారు కొన్నాడు. 
 
2003 జూన్‌లో అతని ఇల్లు ధ్వంసం కావడంతో అతని పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. చేసేది లేక సమీపంలోని అడవి వద్ద కారును పార్కు చేసుకుని, దానిలోనే నివసిస్తున్నాడు. జీవనోపాధి కోసం బుట్టలు అల్లి, ఒక్కో బుట్ట రూ.40 చొప్పున అమ్ముతున్నాడు. అతనిని తిరిగి సాధారణ జీవనం గడిపేలా చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం లేకపోతోంది.