ఇదిగో నా బంగారం, నా బీరువా అంటూ మొత్తం చూపించేసింది: యూ ట్యూబర్ ఇంటిని దోచేసిన దొంగలు, వీడియో
ఈమధ్య కాలంలో హోం టూర్స్ అంటూ పలువురు యూ ట్యూబర్లు వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హోం టూర్లో తమ ఇంట్లో ఏ మూలన ఏమి వున్నదో, తమ ఇంట్లో ఎంతటి విలువైన వస్తువులు వున్నాయో చక్కగా చూపిస్తుంటారు. ఇట్లాగే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుర్జార్ అనే మహిళ తను మోహని గ్రామంలో నివాసం వుంటున్నాననీ, తన ఇల్లు చిరునామాతో పాటుగా ఇంట్లో వున్న వస్తువులన్నిటినీ చూపించింది. ఇందులో భాగంగా సుమారు 8 లక్షల రూపాయలకు పైగా విలువున్న బంగారు నగలను ఓ బల్లపై పేర్చి చక్కగా ప్రదర్శించింది.
ఇవన్నీ యూ ట్యూబ్ ద్వారా తిలకించిన దొంగలు చక్కగా పక్కా ప్లాన్ వేసుకున్నారు. శనివారం అర్థరాత్రి దాటాక సదరు యూ ట్యూబర్ చెప్పిన చిరునామా గల ఇంటికి వచ్చేసారు. చాకచక్యంగా ఇంట్లోకి ప్రవేశించి సదరు యూ ట్యూబర్ కుటుంబ సభ్యులు నిద్రపోతున్న గదికి బైట నుంచి తాళం వేసేశారు. ఆ తర్వాత ఎంచక్కా యూ ట్యూబర్ వీడియోలో చూపించినవి వెతుకుతూ ఇంట్లో వున్న వెండి, బంగారు ఆభరణాలతో పాటు నగదును కూడా దోపిడీ చేసారు.
పోతూపోతూ ఎనర్జీ డ్రింక్స్ కూడా పట్టుకెళ్లారు. ఈ దోపిడీకి పాల్పడేముందు దొంగలు ఇంట్లోని సిసి కెమేరాలకు చిక్కకుండా వుండేందుకు ఓ కర్ర సాయంతో కెమేరాల యాంగిల్స్ వేరేవైపుకి తిప్పేసారు. ఉదయాన్నే లేచిన యూట్యూబర్ తన గదికి బైట నుంచి లాక్ చేసి వుండటాన్ని గమనించి ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేసింది. వాళ్లు లోపలికి వచ్చి చూడగానే దోపిడీ జరిగిందని తేలింది. యూ ట్యూబర్ గుర్జార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో ఇట్లాంటి వ్యక్తిగత విషయాలను పెట్టేటపుడు జాగ్రత్తగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు.
