కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు
అసలే ఎండాకాలం. ఈ వేసవిలో మంచుతో కప్పబడి చల్లగా వేసివి తాపాన్ని తీర్చే కాశ్మీర్ లోయలు, కొండలు చూడాలని ఎవరికి వుండదు. అందుకే ఈ సమయంలో పెద్దసంఖ్యలో కాశ్మీర్ అందాలను చూసేందుకు పర్యాటకులు బయలుదేరి వెళ్తుంటారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లి కాశ్మీరు లోయల అందాలను చూద్దామని కేబుల్ కార్ ఎక్కారు 300 మందికి పైగా పర్యాటకులు. అనుకోకుండా అందులో సాంకేతిక లోపం తలెత్తింది. గుల్మార్గ్ గోండోలా సర్వీసు నిలిచిపోవడంతో 300 మంది పర్యాటకులు గాలిలోనే చిక్కుకుపోయి ఆహ్లాదానికి బదులు అరుపులు, కేకలు వేసారు.
సోమవారం నాడు ఉత్తర కాశ్మీర్లో కేబుల్ కార్ సాంకేతిక లోపం కారణంగా గుల్మార్గ్ గోండోలా సర్వీసు నిలిచిపోవడంతో 300 మందికి పైగా పర్యాటకులు గాలిలోనే చిక్కుకుపోయారు. దీంతో భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. గోండోలా వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా అకస్మాత్తుగా సేవలు నిలిచిపోవడంతో సుమారు 300 మంది పర్యాటకులు కేబుల్ కార్లలో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
ఆర్మీకి చెందిన 9 రాజపుతానా రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, పౌర పరిపాలన సిబ్బందితో కూడిన సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, తరలింపు ప్రయత్నాలను ప్రారంభించాయి. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు టాంగ్మార్గ్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈలోగా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాల మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) నలిన్ ప్రభాత్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారని రాజ్భవన్ ధృవీకరించింది.
గోండోలా గాలిలో మధ్యలోనే ఆగిపోవడంతో మహిళలు, పిల్లలతో సహా చాలా మంది పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే, పరిస్థితి అదుపులోనే ఉందని, తరలింపు ప్రక్రియ సజావుగా సాగుతోందని అధికారులు చెప్పారు. లోపానికి గల కారణాన్ని గుర్తించి, కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు సాంకేతిక బృందాలను కూడా రంగంలోకి దించారు.
