శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 అక్టోబరు 2020 (13:54 IST)

మా దెబ్బ రుచి చూపించేందుకు సిద్ధం.. చైనా కాస్కో : అమిత్ షా

పొరుగు దేశం చైనాతో ఉన్న సరిహద్దు వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా, లడఖ్ సరిహద్దు ప్రాంతానికి చైనా భారీ సంఖ్యలో బలగాలు, యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్లను తరలిస్తూ, శాంతియుత వాతావరణానికి భగ్నం చేస్తోంది. పైగా, భారత్‌తో యుద్ధానికి సై అంటూ సంకేతాలిస్తోంది. అయితే, చైనా చేస్తున్న వ్యాఖ్యలకు ధీటుగానే భారత్ కూడా స్పందిస్తోంది.

ఇప్పటికే భారత విదేశాంగ, రక్షణ శాఖలు ధీటుగా స్పందించగా, తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తనదైనశైలిలో స్పందించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా, స్పందించేందుకు భారత సైన్యం ఎల్లప్పుడూ సర్వ సన్నద్ధంగా ఉంటుందన్నారు. యుద్ధానికి సిద్ధం కావాలంటూ చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ చైనా బలగాలకు సూచించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 
 
'ఒక్క అంగుళం భూమిని కూడా భారత్ ఎప్పటికీ చైనాకు ఇవ్వదు. మన సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను రక్షించే సామర్థ్యం మన జవాన్లకు, రాజకీయ నాయకత్వానికి పుష్కలంగా ఉంది. యుద్ధానికి ఏ దేశమైనా ఎప్పటికీ రెడిగానే ఉంటుంది. ఎలాంటి విపత్తు వచ్చినా... ధీటుగా ప్రతిస్పందించాలన్న ఉద్దేశంతోనే ఏ దేశమైనా సైన్యాన్ని నిర్వహిస్తుంది. అయితే నేను ఈ వ్యాఖ్యలను ఎవర్నీ దృష్టిలో పెట్టుకునే మాట్లాడటం లేదు. కానీ... భారత సైన్యం మాత్రం ఎప్పటికీ సిద్ధంగానే ఉంటుందని మాత్రం చెప్పగలను’’ అని షా ప్రకటించారు. 
 
భారత్ - చైనా దేశాల మధ్య సైనికాధికారుల స్థాయి చర్చలు జరుగుతూనే ఉన్నాయని, దౌత్య మార్గాలు కూడా తెరిచే ఉన్నాయని, అయినా... ఓ హోంమంత్రిగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. దేశం చాలా జాగరూకతతో ఉందని, ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉంటంకిస్తున్నట్లు షా పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత మూడు దశల్లో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన స్పందించారు. ఈ ఎన్నికల్లో బీహార్‌లో అధికారి జేడీఎస్‌తో బీజేపీ కలిసి పోటీ చేస్తోంది. దీనిపై అమిత్ షా స్పందిస్తూ, ఎన్నికల తర్వాత బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా... నితీశ్ కుమారే తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. వచ్చే ఎన్నికల్లో 2/3 వంతు సీట్లను ఎన్డీయే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 
 
'ఒకవేళ.... కానీ.... ఇలా సందిగ్ధం లేదు. నితీశ్ కుమారే తదుపరి సీఎం. ఇప్పటికే ప్రకటించాం. దానికే కట్టుబడి ఉంటాం' అని షా స్పష్టం చేశారు. గౌరవప్రదమైన సీట్లనే తాము ఎల్జేపీకి కేటాయిస్తామని చెప్పామని, అయినా... ఎన్డీయే వీడి చిరాగ్ వెళ్లిపోయారని, అది ఎంత మాత్రం తమ తప్పు కాదన్నారు. ఎన్డీయే కూటమి నుంచి బయటికి వెళ్లాలన్న నిర్ణయం చిరాగే తీసుకున్నారని, తమ నిర్ణయం కాదని షా తెలిపారు.