గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జనవరి 2026 (09:00 IST)

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య యుద్ధ గంటలు... ఇరాన్‌కు వెళ్లొద్దంటూ భారత్ విజ్ఞప్తి

flight
గత కొన్ని రోజులుగా ఇరాన్‌లో హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. దీంతో ఇరాన్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. మరోవైపు, ఆ దేశంపై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇరాన్‌లోని భారతీయులంతా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో ఇరాన్‌ను వీడాలని సూచించింది.  అలాగే, ప్రస్తుతం పరిస్థితుల్లో భారతీయులు ఎవరూ ఇరాన్‌కు వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది. 
 
మరోవైపు, వాణిజ్య విమానాల రాకపోకలకు ఇరాన్‌ గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారిమళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి.
 
'ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇరాన్‌ మీదుగా వెళ్లాల్సిన కొన్ని విమాన సర్వీసులను దారిమళ్లిస్తున్నాం. ప్రత్యామ్నాయ మార్గాలు సాధ్యం కాని కొన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నాం. ప్రయాణికులు అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి. ఈ అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. కానీ.. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం' అని ఎయిరిండియా సోషల్‌ మీడియా ఖాతాలో వెల్లడించింది.
 
మరో విమానయాన సంస్థ ఇండిగో కూడా ఇదే తరహా అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్‌ గగనతలం మూసివేయడంతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడిందని తెలిపింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు తమకు సహకరించాలని కోరింది.