పాఠశాలలో చిరుతపులి.. క్లాస్ రూమ్లోనే విద్యార్థులు, టీచర్లు.. 4 గంటల పాటు...
చిరుతపులి పాఠశాలలో కనిపించి విద్యార్థులను, ఉపాధ్యాయులను హడలెత్తించింది. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. పులి భయంతో నాలుగు గంటల పాటు విద్యార్థులు, టీచర్లు క్లాస్ రూమ్ లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.
ఉనా జిల్లాలోని గిర్ అభయారణ్యంకు సమీపంలో ఉన్న పాల్డీ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోకి మంగళవారం చిరుతపులి ప్రవేశించడంతో విద్యార్థులు, టీచర్లు క్లాస్ రూమ్ లోకి పరుగులు తీశారు. 40 మంది విద్యార్థులు, టీచర్లు నాలుగు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.
మంగళవారం ఉదయం అసెంబ్లీ ముగిసిన తర్వాత మెట్ల కింద పిల్లి లాంటి జంతువు ఉందని టీచర్లకు విద్యార్థులు తెలిపారు. చిరుతపులిగా గుర్తించడంతో అందరూ జడుసుకున్నారు. తర్వాత అటవీ అధికారులు చిరుతను బంధించి సమీపంలోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిరుతను తీసుకెళ్లిన తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు.