1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Madhya Pradesh : BJP leader Santosh Pathak is alleged to have publicly assaulted a woman.

బీజేపీ నేత అరాచకం... రోడ్డుపై మహిళను కర్రతో చావబాదాడు (వీడియో)

bjp leader
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన నేత ఒకరు అరాచకానికి పాల్పడ్డాడు. ఓ మహిళను రోడ్డుపై కర్రతో విచక్షణా రహితంగా చావబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్ వైరల్‌గా మారడంతో తీవ్ర దుమారం రేపుతోంది. సదరు నేతపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిందితుడుని బీజేపీకి చెందిన సంతోష్ పాఠక్‌గాను, బాధితురాలిని హేమా సింగ్‌గా గుర్తించారు. హేమా సింగ్ బహ్రీ మార్కెట్లో చిన్న బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాత్రికి రాత్రే తన బండిని, దుకాణాన్ని సంతోష్ పాఠక్ తొలగించాడని, దీనిపై తాను బహ్రీ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపారు.
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం మార్కెట్‌లో బండి పెట్టుకునే విషయంలో ఇద్దరి మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. వాగ్వాదం పెరగడంతో సంతోష్ పాఠక్ ఆమెపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. అక్కడున్న వారిలో ఒకరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్ఎస్ కింద వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. "ఈ రోజు నేను బండి పెట్టుకోవడానికి రాగానే సంతోష్ పాఠక్, మరొకరు వచ్చి నన్ను దూషించడం మొదలుపెట్టారు. ఆపమని కోరగా, ఈ ప్రాంతంలో తాను చెప్పిందే నడుస్తుందని బెదిరించాడు. 8-10 ఏళ్లుగా ఇక్కడే బండి నడుపుతున్నానని చెప్పినా వినకుండా కర్రతో కొట్టాడు" అని బాధితురాలు పోలీసులకు వివరించారు. అక్కడున్న వారెవరూ తనను కాపాడటానికి ముందుకు రాలేదని ఆమె వాపోయింది. 
 
నిందితుడు సంతోష్ పాఠక్ స్థానిక సిహావల్ ఎమ్మెల్యే విశ్వామిత్ర పాఠక్‌కు సన్నిహితుడని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఘటనపై ఎమ్మెల్యేగానీ, బీజేపీగానీ అధికారికంగా స్పందించలేదు. పూర్తిస్థాయి విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 


 
తర్వాతి కథనం
Tirumala Laddu, చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పండి: జగన్‌కు అర్నాబ్ డిమాండ్