మైక్రోసాఫ్ట్: అక్కడ కోత... ఇక్కడ కూత.. 18 వేల ఉద్యోగాలు గోవిందా!
అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వచ్చే ఏడాది కాలంలో 18 వేల ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. భారత్కు చెందిన సత్య నాదెళ్ల ఐదు నెలల క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిబ్బందికి ఉద్వాసన ప్రకటన చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2009లో మైక్రోసాఫ్ట్ 5,800 మంది ఉద్యోగులను తొలిగించిన తర్వాత మళ్లీ ఇంత భారీస్థాయిలో కోతలను ప్రకటించింది.
ఈ చర్యలు కఠినమైనవే అయినా... నోకియా మొబైల్ డివైస్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్తో అనుసంధానించేందుకు ప్రధానంగా మైక్రోసాఫ్ట్, నోకియా డివెజైస్ల మధ్య సిబ్బంది పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. తొలి విడతలో భాగంలో 13,000 సిబ్బందిని తగ్గించుకునే చర్యలను ప్రారంభించామని... వచ్చే ఆరు నెలల్లో ఎవరిని తొలగించబోతున్నామనేది ప్రకటిస్తామని నాదెళ్ల వెల్లడించారు. అయితే ఉద్యోగుల తొలగింపు విషయంలో పారదర్శకత పాటిస్తామన్న నాదేళ్ల సత్య, తొలగించిన ఉద్యోగులకు జాబ్ ట్రాన్సిషన్ కింద కొంత సహాయం చేస్తామని ఉద్యోగులకు మెయిల్ చేశారు.
ఇది కఠిన నిర్ణయమైనా తప్పనిసరి అని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో ఆయన పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా రానున్న 12 నెలల్లో పన్ను ముందస్తు చార్జీల రూపంలో 1.6 బిలియన్ డాలర్లను(సుమారు రూ.9,600 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగులకు మెయిల్ చేశారు.
అయితే, భారత్ చాలా కీలకమైన మార్కెట్గా నిలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగాల కోతలు పెద్దగా ఉండకపోవచ్చని అభిప్రాయం వెలువడుతోంది. తమకు భారత్లో నోకియా డివెజైస్తో సహా 6,500 మంది ఉద్యోగులు ఉన్నారని.. మైక్రోసాఫ్ట్ సిబ్బంది పునర్వ్యవస్థీకరణ ప్రభావం ఇక్కడ చాలా స్పల్పంగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి భారత్ వ్యవహారాలు చూసే మైక్రోసాఫ్ట్ వర్గాలు.
ఇక్కడ కూత
ఇది ఇలావుంటే ఒకవైపు మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరణకు నడుం బిగించింది. ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ సి.ఇ.ఓ సత్య నాదెళ్ల ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రాబాబు, కేసీఆర్లతో సమావేశం కానున్నట్టు, డిసెంబర్లో సత్య నాదెళ్ల భారత్ పర్యటించే అవకాశం ఉన్నట్లు అధికారిక సమాచారం. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ అధికారులు సమావేశమై ప్రాధమిక చర్చలు కూడా జరిపారు. అయినా అక్కడ ఉద్యోగుల్లో విధిస్తున్న కోతలతో సంబంధం లేకుండా ఇక్కడ మైక్రోసాఫ్ట్ తమ శాఖలను రెండు రాష్ట్రాల్లోనూ విస్తరించడం మంచి పరిణామం.