శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (08:47 IST)

రాజీవ్ హంతకురాలికి మంగళహారతులతో స్వాగతం... చోద్యం చూసిన ఖాకీలు

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధానముద్దాయిల్లో ఒకరైన నళిని జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు  వేలూరులో కొన్ని తమిళ సంఘాల నేతలు, కార్యకర్తలు మంగళహారతులతో స్వాగతం పలకడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
 
నిజానికి రాజీవ్ హత్య కేసులో నళినితో పాటు మరికొందరు ముద్దాయిలు గత 28 యేళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు. వీరి విడుదలపై రాష్ట్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా రాజీవ్ ముద్దాయిలంతా జైలు జీవితం గడుపుతోంది.
 
ఈ నేపథ్యంలో తన కుమార్తె వివాహం నిమిత్తం పెరోల్ మంజూరు చేయాలని నళిని దరఖాస్తు చేసుకుంది. దీంతో ఆమెకు పెరోల్ మంజూరైంది. దీంతో 28 యేళ్ళ తర్వాత ఆమె బాహ్యప్రపంచంలోకి వచ్చింది. ఆమెకు బంధువులు కన్నీటి మధ్య హారతులు పడుతూ స్వాగతం పలికారు. 
 
తన తల్లి పద్మ, కాట్పాడి బ్రహ్మపురానికి చెందిన మహిళ జామీనుతో జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె వేలూరు, రంగాపురంలోని పులవర్‌ నగర్‌‌లో ద్రావిడ సిద్ధాంతాలకు చెందిన తమిళ పేరవై రాష్ట్ర జాయింట్‌ కార్యదర్శి సింగరాయర్‌ ఇంట్లో ఉంటూ, కుమార్తె వివాహాన్ని జరిపించనున్నారు. 
 
నళిని వచ్చే సమయానికే ఆ ఇంటికి చేరుకున్న పద్మ, ఇతర బంధువులు ఆమెకు హారతులు పట్టి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇక ఆమె భర్త మురుగన్ ఇంతవరకూ పెరోల్ కోరలేదు. పెళ్లి నిశ్చయమైన తర్వాత, కుమార్తె వివాహాన్ని జరిపించేందుకు ఆయన పెరోల్ కోరవచ్చని తెలుస్తోంది.