శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (12:41 IST)

మీ మధ్యలో జరుపుకుంటేనే నాకు దీపావళి.. ప్రధాన మంత్రి మోదీ

''మీ మధ్యలో దీపావళి జరుపుకుంటేనే నాకు దీపావళి పండగలా అనిపిస్తుంది... అంటూ సైనికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పర్యటించారు. సైనికుల మధ్యే దీపావళి పండగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పై వ్యాఖ్యలు చేశారు.
 
దేశ సరిహద్దుల వెంబడి ఉన్న అనేక పోస్టుల్లో ఎవరికైనా ఎక్కువ కాలం గుర్తుండే పోస్ట్ 'లోంగేవాలా పోస్ట్' అని, తరతరాలుగా ఈ లోంగేవాలా పోస్ట్ అందరికీ గుర్తుండి పోతుందని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు. ఇక్కడే దాయాది పాకిస్తాన్‌కు భారత జవాన్లు దీటైన సమాధానం చెప్పారని, శత్రువులెవరూ దేశ జవాన్ల ముందు నిలబడలేరన్న గట్టి సంకేతాలను కూడా ఇక్కడి నుంచే పంపారని మోదీ గుర్తు చేశారు.
 
ప్రతి భారతీయుడి గుండెల్లో శౌర్యాన్ని నింపే విధంగా సైనికులు ఈ పోస్ట్‌లో తమ పరాక్రమాన్ని చూపారని మోదీ ప్రశంసించారు. సరిహద్దుల వెంట దేశం కోసం పనిచేస్తోన్న సైనికులందరి కుటుంబాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ... వారందరికీ శిరస్సు వంచి నమస్కరించారు. 
 
దేశం సురక్షితంగా ఉందంటే సరిహద్దుల్లో రక్షణగా ఉన్న సైనికుల వల్లేనని, తీవ్రవాదంతో, ఉగ్రవాదంతో, దేశ ద్రోహులతో జవాన్లు పోరాడుతూ... దేశానికి రక్షణ కల్పిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇతర దేశాలను అర్థం చేసుకోడానికే భారత్ మొదట ప్రాధాన్యం ఇస్తుందని, ఆ సమయంలో ఇతర దేశాలు కూడా భారత్‌ను అదే రీతిలో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. 
 
ఈ సిద్ధాంతాన్ని పక్కనబెట్టి, దీనికి వ్యతిరేకంగా ఏ దేశం ప్రవర్తించినా భారత్ వారికి గట్టిగా బుద్ధి చెబుతుందని ప్రధాని మోదీ తీవ్రంగా హెచ్చరించారు. హిమాలయ శిఖరాల్లో ఉన్నా... ఎడారిలో ఉన్నా, దట్టమైన అడువులు, లోతైన సముద్రాలు... ఇలా ఎక్కడ ఉన్నా శౌర్యంతో జవాన్లు పోరాడతారని, ఎదురయ్యే ప్రతి సవాల్‌లోనూ విజయం సాధిస్తూనే ఉంటున్నారని సైనికులపై ప్రశంసల వర్షం కురిపించారు.