నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు
నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్షా ప్రశ్నపత్రం లీకైన విషయం తెల్సిందే. దీంతో ఆ రాత పరీక్షను ఎన్.టి.ఏ. రద్దు చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
పర్యవేక్షణా యంత్రాంగాలు, సంబంధిత కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన ఎలా జరిగిందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇలాంటి సంఘటన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీవ్ర మానసిక క్షోభను కలిగిస్తుందని, వారిని ఇలా నిరాశపెట్టడం సరికాదని అభిప్రాయపడింది. పేపర్ లీక్ విషయంలో లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని, అప్పటివరకు అసలు సమస్య ఆగదని వ్యాఖ్యానించింది.
అయితే, యువత ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం ధర్మాసనానికి వెల్లడించారు. పరిస్థితిని ప్రధానమంత్రి కూడా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జూన్ 21న మరోసారి నిర్వహించే నీట్-యూజీ పరీక్ష కోసం కొత్త యంత్రాంగాలను ఏర్పాటు చేశామన్నారు. అయితే, ఈ వ్యవహారంపై ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది.
