రామమందిర నిర్మాణంతో భారత్లో ఐఎస్ విస్తరణకు బ్రేక్ పడ్డట్టే!: తొగాడియా
భారత్ మరో సిరియాగా మారకుండా ఉండాలంటే రామ మందిరం నిర్మాణాన్ని చేపట్టాల్సిందేనని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా స్పష్టం చేశారు. దేశంలో హిందువులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, అసలు హిందువుల మాట వినే నాథుడే కరవయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని జబల్ పూర్లో జరుగుతున్న వీహెచ్పీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా సోమవారం తొగాడియా కీలక వ్యాఖ్యలు చేశారు.
రామమందిర నిర్మాణంతో భారత్లో ఐఎస్ విస్తరణకు అడ్డుకట్ట పడినట్టేనని కూడా తొగాడియా వ్యాఖ్యానించారు. ఒక్క ఉగ్రవాద విస్తరణకు అడ్డుకట్ట పడటమే కాకుండా రామ మందిర నిర్మాణంతో దేశ ఆర్థికాభివృద్ధి కూడా సాధ్యపడుతుందని తొగాడియా పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం పార్లమెంటులో ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.