నెహ్రూ వికీపీడియా పేజ్ సవరణ ఘటనపై దర్యాప్తు ప్రారంభం: టెలికాం మంత్రి
మాజీ ప్రధాన మంత్రి, దివంగత జవహర్ లాల్ నెహ్రూ వికీపీడియా పేజ్ ఎడిట్ చేసిన ఘటనపై దర్యాప్తు మొదలైందని కేంద్రం తెలిపింది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో ఎడిట్ చేసిన ఈ ఘటనపై దర్యాప్తు మొదలెట్టేశామని లోక్ సభలో కేంద్ర టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ వెల్లడించారు.
"వికీపీడియా పేజీని అసలెక్కడి నుంచి సవరించారో తెలుసుకునేందుకు చర్యలు ప్రారంభించాం" అని లిఖిత పూర్వక సమాధానంలో శంకర్ ప్రసాద్ చెప్పారు. వికీపీడియా వెబ్ సైట్లో ప్రచురించిన సమాచారం ప్రకారం, 'వికీమీడియా ఫౌండేషన్' సపోర్ట్ చేస్తున్న బహుభాషా, వెబ్ ఆధారిత, ఫ్రీ కంటెంట్ ఎన్సైక్లోపీడియా ప్రాజెక్ట్ అని వివరించారు. దాన్ని ఎలాగైనా సవరించుకోవచ్చని అన్నారు.
అయితే ఇంటర్నెట్ ఉన్న ఎవరైనా వికీపీడియా వెబ్ సైట్లో ఉన్న ఆర్టికల్స్ను సవరించవచ్చన్నారు. పరిమిత సందర్భాలలో మాత్రమే అంతరాయం లేదా విధ్వంసాన్ని అరికట్టేందుకు సవరణను నియంత్రిస్తారని మంత్రి రవిశంకర్ వెల్లడించారు.