ఆర్ఏసీ కేటగిరీ కింద బెర్త్ ఖరారు కాకుంటే సగం చార్జీ ఇవ్వాలి : పార్లెమెంటరీ కమిటీ
ప్రస్తుతం రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్ (ఆర్ఏసి) కేటగిరీ కింద బెర్త్ ఖరారు కాకపోయినా పూర్తి చార్జీని వసూలు చేస్తున్నారు. దీన్ని పార్లమెంటరీ కమిటీ తప్పుబట్టింది. ఆర్ఏసీ కింద బెర్తు ఖరారుకాని పక్షంలో వసూలు చేసిన ప్రయాణ చార్జీలో కొంతభాగం సదరు ప్రయాణికుడుకి ఇవ్వాలని ఈ కమిటీ సూచించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. 'పంక్చువాలిటీ అండ్ ట్రావెల్ టైమ్ ఇన్ ట్రైన్ ఆపరేషన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్' పేరుతో పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ప్రజాపద్దుల కమిటీ పేర్కొంది.
ప్రస్తుతం ఆర్ఏసీ కింద బెర్త్ బుక్ చేసుకునే ప్రయాణికుల నుంచి పూర్తి మొత్తంలో టికెట్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇదే కేటగిరి కింద ఉండే మరో ప్రయాణికుడితో బెర్త్ పంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరు ప్యాసింజర్లు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తున్నారు. అంటే ఇద్దరు ప్రయాణికులు ఒకే బెర్తును షేర్ చేసుకుంటూ ప్రయాణ చార్జీని మాత్రం పూర్తిగా చెల్లించడం సబబు కాదని అభిప్రాయపడింది. ఇలాంటి ప్రయాణికులకు టికెట్లో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలను తెలియజేయాలని పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది.