మోడీ లాహోర్ పర్యటనపై సామ్నా: వాజ్ పేయ్, అద్వానీ తరహాలోనే...?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాహోర్ పర్యటనపై శివసేన సొంత పత్రిక ''సామ్నా'' తన సంపాదకీయంలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. పాకిస్థాన్లో పర్యటించిన నేతలందరి కెరీర్ ఆ తర్వాత అత్యంత వేగంగా ముగిసిందని పేర్కొంది. ఇందుకు మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారీ వాజ్ పేయ్, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీలను ఉదహరించింది.
ఇప్పటికే మోడీ లాహోర్ పర్యటనపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మిత్రపక్షం శివసేన కూడా స్వరం పెంచడం గమనార్హం. రష్యా, ఆప్ఘనిస్థాన్ పర్యటనను ముగించుకుని కాబూల్లో తిరుగు ప్రయాణానికి కొన్ని గంటల ముందు ఖరారైన ఈ పర్యటనలో పాకిస్థాన్ నగరం లాహోర్లో మోడీ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మోడీకి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత దగ్గరుండి మరీ మోడీని నవాజ్ లాహోర్ శివారు ప్రాంతం రాయ్ విండ్లోని తన ఇంటికి తీసుకెళ్లారు.
దాదాపు రెండు గంటలకుపైగా నవాజ్ ఇంటిలో గడిపిన మోడీ ఆపై ఇండియాకు వచ్చారు. మోడీ ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మనుమరాలు పెండ్లి వేడుకలోనూ హాజరయ్యారు.