భార్య మంటల్లో కాలిపోతుంటే వీడియో తీసిన శాడిస్ట్ భర్త అరెస్టు
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఓ శాడిస్ట్ భర్త.. తన కళ్లముందే కట్టుకున్న భార్య మంటల్లో కాలిపోతుంటే వీడియో తీస్తూ ఉండిపోయాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన వివరాలను పరిశీలిస్తే,
బీహార్ రాష్ట్రానికి చెందిన రంజిత్ సాహా అనే వ్యక్తి ప్రతిమా దేవీ (31) అనే మహిళను గత 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. వీరంతా మూడేళ్ల క్రితం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరానికి వచ్చి స్థిరపడ్డారు. ఇటీవల భర్తతో గొడవపడిన ఆమె ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
అయితే, మృతురాలి భర్తపై అనుమానంతో ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా ఆమె నిప్పంటించుకున్న సమయంలో రంజిత్ తన ఫోన్లో రికార్డు చేసిన వీడియోను పోలీసులు గుర్తించారు.
గొడవ జరుగుతున్నప్పుడు భార్యను అతడు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో తన ప్రమేయం ఏమీ లేదని చెప్పేందుకే ఈ వీడియో తీశానని అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.