ఆదివారం, 2 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2025 (16:55 IST)

బీహార్ వలస కార్మికులను తమిళనాడు సర్కారు వేధిస్తోందా?

mk stalin
తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం బీహార్ వలస కార్మికులను వేధిస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసి వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రధాని మోడీ ఓ ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తూ, తమిళనాడులో పనిచేస్తున్న బీహారీ కార్మికులను డీఎంకే  ప్రభుత్వం అవమానిస్తోందని, వారిపై వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తూ సీఎం స్టాలిన్ 'ఎక్స్' వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.
 
"ఒక తమిళుడిగా ప్రధాని మోడీని నేను వినయంగా కోరుతున్నాను. ఆయన దేశ ప్రజలందరికీ ప్రధాని అనే గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారనే విషయాన్ని తరచుగా మర్చిపోతున్నారేమో అని బాధగా ఉంది. ఇలాంటి ప్రకటనలతో తన పదవికి ఉన్న గౌరవాన్ని కోల్పోవద్దు" అని స్టాలిన్ పేర్కొన్నారు. 
 
బీజేపీ సభ్యులు కేవలం ఎన్నికల రాజకీయాల కోసం ఒడిశా, బీహార్ అంటూ తమిళులపై తమ ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారని, ఒక ముఖ్యమంత్రిగా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వం పెంచినట్లే, ఇప్పుడు తమిళులు, బీహార్ ప్రజల మధ్య విరోధం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని స్టాలిన్ విమర్శించారు. "ఇటువంటి చిల్లర రాజకీయ పద్ధతులు మానుకుని, దయచేసి దేశ సంక్షేమంపై దృష్టి పెట్టండి" అని ప్రధానికి, బీజేపీ నేతలకు ఆయన హితవు పలికారు.