సీఎం విజయ్ సంచలన నిర్ణయం : ఆ టాస్మాక్ దుకాణాల మూసివేతకు ఆదేశం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, విద్యా సంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం టాస్మాక్ దుకాణాలను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. రెండు వారాల్లోగా ఈ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీచేశారు.
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,765 టాస్మాక్ మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో మూసివేయనున్న 717 షాపుల్లో 276 ప్రార్థనా మందిరాలు, 176 విద్యా సంస్థలు, 225 బస్టాండ్లకు సమీపంలో ఉన్నట్టు గుర్తించారు. ఈ సున్నితమైన ప్రాంతాల్లో మద్యం లభ్యతపై వస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఈ సామాజిక సంస్కరణ చర్య చేపట్టినట్టు కొత్త ప్రభుత్వం తెలిపింది.
ఇదే క్రమంలో గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై కూడా ఆయన సంతకం చేశారు. మహిళల భద్రత కోసం సింగ పెణ్ పేరుతో ప్రత్యేక దళం, ప్రతి జిల్లాలో యాంటీ డ్రగ్ స్క్వాడ్లో ఏర్పాటుకు ఆయన ఆమోదం తెలిపారు.
కాగా, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ, డీపీఐ, ఐయూఎంఎల్ వంటి పార్టీల మద్దతుతో రాష్ట్రంలో తొలిసారి ద్రవిడేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
