ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ నగర్లో ఓ దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థి, ఆర్ట్స్ పట్టభద్రుడు కలిసి ఓ మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేసి ఆ మహిళ మృతి కారణమయ్యారు. ఇది వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, ప్రియాంక (28) అనే గర్భిణిని ప్రసవం కోసం ఫిబ్రవరి 5వ తేదీన బాస్కరిలోని నవజీవన్ హాస్పిటల్ లో చేర్పించారు. వర్మ (32), శుభమ్ విశ్వకర్మ (19) అనే ఇద్దరు ఆమెకు సిజేరియన్ చేశారు. ఆపరేషన్ తర్వాత ప్రియాంక ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, అనస్థీషియా ప్రభావం నుంచి కోలుకోకముందే ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. పరిస్థితి విషమించడంతో లక్నోకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది.
పోలీసుల దర్యాప్తులో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడు యోగేశ్ వర్మ బీఏ చదవగా, అతడి తండ్రి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డ్ బాయ్గా పనిచేసేవాడు. తండ్రికి సహాయం చేస్తూ కొన్ని వైద్య విధానాలు నేర్చుకున్నట్లు అతడు తెలిపాడు. మరో నిందితుడు శుభమ్ విశ్వకర్మ ఇంటర్ మాత్రమే చదివాడు. వీరు కేవలం రూ.3,000 నుంచి రూ.5,000కే సిజేరియన్లు చేస్తూ పేదలను ఆకర్షిస్తున్నట్లు తేలింది.
ఈ నవజీవన్ హాస్పిటల్ ఐదేళ్లుగా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రియాంక మరణంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో హాస్పిటల్ నిర్వాహకురాలు రూబీ పరారైంది. అధికారులు హాస్పిటల్ను సీజ్ చేసి, నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో నిందితులపై హత్యకు సమానమైన నేరం కింద మరో కేసు పెట్టారు. పరారీలో ఉన్న రూబీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.