సంబంధిత వార్తలు
- చకచక పనులు చేస్తోన్న విజయ్.. శ్రీలంక జాలర్ల కోసం జైశంకర్కు లేఖ
- ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్
- హిందూ మతం అనేది ఒక జీవన విధానం : సుప్రీంకోర్టు
- రూ. 30 వేలు తీసుకున్న లంచగొండి మైనింగ్ అధికారిని పట్టుకుంటే రూ. 4 కోట్లు బయటపడ్డాయి
- ఇంధన సంక్షోభం - కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించిన ప్రధాని మోడీ
NEET UG-2026: నీట్ను రద్దు చేయాలి... తమిళనాడు సీఎం విజయ్
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (జాతీయ అర్హత- ప్రవేశ పరీక్ష)ను రద్దు చేయాలని గట్టి పిలుపునిస్తూ, ఈ ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ నేపథ్యాలు, సామాజిక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పేర్కొన్నారు. తమిళనాడులోని 31 నగరాల్లో మే 3న నిర్వహించిన నీట్ 2026 పరీక్ష రద్దు విషయాన్ని ప్రస్తావిస్తూ, నీట్ ప్రారంభమైనప్పటి నుండి తమిళనాడు ప్రభుత్వం దీనిని నిరంతరం, ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూనే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
నీట్ పరీక్షను రద్దు చేయాలని, అలాగే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులలో రాష్ట్ర కోటా కింద ఉన్న అన్ని సీట్లను 12వ తరగతి మార్కుల ఆధారంగా భర్తీ చేసుకునే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నపత్రం లీకైందన్న ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ జరిపిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఏడాది నీట్ పరీక్షను రద్దు చేయడం అనేది ఈ జాతీయ స్థాయి పరీక్షలో ఉన్న లోపాలకు, మౌలికపరమైన వైఫల్యాలకు తిరుగులేని నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయాన్ని విచారణ నిమిత్తం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించినట్లు విజయ్ తెలిపారు. నీట్ పరీక్షలో లోపాలు బయటపడటం ఇదే మొదటిసారి కాదని కూడా ఆయన పేర్కొన్నారు. 2024లో ప్రశ్నపత్రం లీక్ అయిందని, దీనికి సంబంధించి ఆరు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, ఆ కేసులన్నీ సీబీఐకి బదిలీ చేయబడ్డాయని ఆయన వివరించారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, కేంద్ర ప్రభుత్వం ఐస్రో మాజీ ఛైర్మన్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ సంస్కరణల కోసం 95 సమగ్ర సిఫార్సులను సమర్పించిందని ఆయన గుర్తుచేశారు. ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి ప్రశ్నపత్రం లీక్ కావడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నీట్- యూజీ 2026 పరీక్ష దేశవ్యాప్తంగా 5,432 కేంద్రాల్లో నిర్వహించబడిందని, తమిళనాడు నుండి సుమారు 1.4 లక్షల మందితో సహా మొత్తం 22,05,035 మంది అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని విజయ్ తెలిపారు. ఈ పరీక్ష రద్దు కావడం వల్ల వైద్య విద్యను ఆశించే లక్షలాది మంది విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయని ఆయన పేర్కొన్నారు.
