నన్ పై అత్యాచార నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు
దేశంలోనే సంచలనం సృష్టించిన క్రైస్తవ సన్యాసిపై అత్యాచారానికి పాల్పడ్డ ప్రధాన నిందితుడు సలీం పట్టుబడ్డాడు. పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు ఇతగాణ్ణి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ కేసును చాలా తీవ్రంగా తీసుకున్నారు. సిబిఐకి కూడా అప్పగించారు. దీంతో పోలీసులు కూడా తమ దర్యాప్తును వేగవంతం చేసి సీసీ పుటేజీ ఆధారంగా ముద్దాయిని పట్టుకోగలిగారు. వివరాలిలా ఉన్నాయి.
పశ్చిమబెంగాల్ నాడియా జిల్లా గంగాపూర్ గ్రామంలోని స్కూల్లో మార్చి 13న దొంగతనానికి వచ్చిన ఏడుగురు దొంగలు ప్రతిఘటించిన 72 ఏళ్ల నన్పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై దాదాపు పన్నెండు లక్షల రూపాయలను దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశంలోనే సంచలనం సృష్టించింది.
స్థానిక రాణాఘాట్ ఆసుపత్రిలో కోలుకుని గత వారం డిశ్చార్జ్ అయిన నన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే దీనిపై దుమారం చెలరేగింది. మానవహక్కుల సంఘం దీనిని సుమోటుగా తీసుకుని కేసు నమోదు చేసింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కేసును సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు నిందితుల ఫోటోలను విడుదల చేశారు. చివరకు వారిని పట్టుకోగలిగారు.