శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2016 (11:36 IST)

ఫేస్‌బుక్‌ చాటింగ్‌లో యువకుడి మాటలు నమ్మి భర్తను కడతేర్చిన భార్య.. ఎక్కడ?

సోషల్ మీడియాలో జరిగే చాటింగ్ సంభాషణలను బలంగా నమ్ముతున్న కొంతమంది ఏమాత్రం వెనుకాముందు ఆలోచన చేయకుండా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి పంజాబ్‌లో జరిగింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. బెహరైన్‌లో ఉండే ఓ యువకుడితో పంజాబ్‌కి చెందిన ఓ వివాహితకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వ్యామోహంగా మారింది. అప్పటికే వివాహమై 14 ఏళ్ల కొడుకు ఉన్న సుఖదీప్ కౌర్ అనే ఆ మహిళ, ఆ యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన భర్త జస్వీర్ సింగ్‌ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
 
తన భర్తను హతమార్చేందుకు ముగ్గురు కిరాయి సభ్యులతో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా సుఖదీప్ కౌర్ తన భర్తకు నీటిలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అవి తాగి, స్పృహ కోల్పోయిన జస్వీర్ సింగ్‌కి అండర్ వేర్ తప్ప మిగిలిన బట్టలన్నీ తొలగించి, ముగ్గురు కిల్లర్స్‌తో కలిసి తీసుకెళ్ళి భాక్రా కెనాల్‌లో పడేసింగి. ఆ తర్వాత కొన్ని రోజులకి తన భర్త మిస్సింగ్ అని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఏప్రిల్ 19న గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న జస్వీర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో, అసలు గుట్టు బయటపడింది. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో సుఖదీప్ కౌర్ అసలు నిజాన్ని బయట పెట్టింది. ఇంతకీ ఏ ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను హతమార్చిందో ఆ యువకుడిని ఇంతవరకు సుఖదీప్ కలవనేలేదట. కేవలం సోషల్ మీడియాలో పరిచయం, చాటింగ్‌తోనే అతన్ని నమ్మి భర్తను కడతేర్చింది.