గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2015 (14:31 IST)

ఇన్‌సెక్యూరిటీ కల్గించేవారితోనే కలసి పని చేయాలి... గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

గూగుల్ నాకు మిఠాయి కొట్టులా...

ప్రపంచ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈఓ గూగుల్ కంపెనీలో అడుగుపెట్టినప్పుడు తన అనుభవాన్ని వివరిస్తూ... గూగుల్‌లో తొలిసారిగా అడుగుపెట్టినప్పుడు ఓ మిఠాయి కొట్టులో అడుగుపెట్టినట్లు సంబరపడ్డానని చెప్పారు. గూగుల్ కంపెనీలో చేరిన తర్వాత తన మనసులో ఏం ఆలోచనలు ఉండేవో... వాటన్నిటినీ నెరవేర్చుకునే వేదిక దొరికిందని, దాంతో తన ఆలోచనలకు పదును పెడుతుండేవాడనని వెల్లడించారు.
 
ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులతో గురువారం ఉదయం పిచాయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన కాలేజీ రోజులకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... 1980ల్లో దశకంలో మద్రాసులో పెరిగానన్నారు. అప్పట్లో తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టంగా ఉండేదనీ, ఓ టెస్టు మ్యాచ్ కూడా చూశానన్నారు. ఐతే ప్రస్తుతం స్పీడుగా సాగిపోయే టీ-20 పోటీలంటే తనకు పెద్దగా ఆసక్తి ఉండదన్నారు. 
 
ఒకవేళ తను గూగుల్ సీఈఓ కాకుండా ఉన్నట్లయితే ఇప్పటికీ సాఫ్ట్వేర్‌ను బిల్డప్ చేస్తూ ఉండేవాడినని అన్నారు. పోటీ ప్రపంచంలో తోటి స్నేహితులతో పనిచేసినప్పుడు... టాలెంటెడ్ పీపుల్ వచ్చి చేరినప్పుడు వారితో ఇన్‌సెక్యూరిటీ ఫీలయ్యారా అని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు పిచాయ్ సమాధానమిస్తూ... అలా ఇన్ సెక్యూరిటీని మనకు కలిగించే వ్యక్తులతోనే కలిసి పనిచేయాలని సూచించారు. అప్పుడే మన టాలెంట్ ఏమిటో నిరూపితమవుతుందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... భారతదేశం అంటే తనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉందని చెప్పారు. గూగుల్ అనేది అద్భుతాల కేంద్రమని ఆయన అభివర్ణించారు. రాబోయే కాలంలో మరిన్ని అద్భుతాలను ప్రపంచం ముదు ఉంచుతామని ఆయన అన్నారు.