శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 11 జులై 2016 (20:56 IST)

తెలంగాణ చరిత్ర పుటలలో మరో అధ్యాయం... ఆటా తెలంగాణ మహా సభల ప్రత్యేకం(ఫోటోలు)

(జూలై 10 డెట్రాయిట్): ఒకసారి తెలంగాణ మట్టి పట్టుకుని చెవి దగ్గర పెట్టి విని చూడమని చెప్పింది అమెరికా తెలంగాణ సంఘం. అంతేకాదు, అట్ల విన్నపుడు ఏం వినిపిస్తుందో కళ్ళారా చూపించింది. తెలంగాణ నేలతల్లినీ, చెమ

(జూలై 10 డెట్రాయిట్): ఒకసారి తెలంగాణ మట్టి పట్టుకుని చెవి దగ్గర పెట్టి విని చూడమని చెప్పింది అమెరికా తెలంగాణ సంఘం. అంతేకాదు, అట్ల విన్నపుడు ఏం వినిపిస్తుందో కళ్ళారా చూపించింది. తెలంగాణ నేలతల్లినీ, చెమట చుక్కలని, పూల పండుగలని, కొలువైన ఇలవేలుపులని, కళాకారులని, కోలాటం, చిందు బాగోతాలతో పాటుగా సమస్త కళారూపాలని, పాటల స్వరూపాలని, సమరుజ్జీవనాలైన పండుగలని, మతాల భిన్నత్వాలలో తెలంగాణ ఏకత్వాన్ని, యాసని, భాషని, త్యాగాలని, త్యాగధనులనీ, మహనీయులనీ, నదుల సింగారాలు, పాతబస్తీ సోయగాలని, శాతవాహన, సమ్మక్క సారక్కల, కాకతీయుల నుండి ఐలమ్మల నుండి మలిదశ ఉద్యమం వరకు పోరాటాల ధిక్కార స్వరాలని, పోరాటాల స్వరూపాలని, తెలంగాణ పడిన కష్టాలని, పునర్నిర్మాణంలో ఇప్పుడు జరుగుతున్న వికేంద్రీకరణనీ నృత్య, గాన, చిత్ర సమ్మేళనమైన ప్రదర్శనతో ఒకసారి తెలంగాణ మట్టి వాసన ఎట్ల ఉంటదో చూపించింది అమెరికా తెలంగాణ సంఘం. సుద్దాల అశోక్ తేజ ఈ తెలంగాణ సభలని పురస్కరించుకొని రాసిన “శ్రీ తెలంగాణకు సిరిమల్లె పువ్వు” పాట, హేమా భమిడిపాటి కొరియోగ్రఫీ చేసిన ఈ ప్రారంభ గీతం ఏకబిగిన 28 నిముషాల పాటు వందల మంది కళాకారులు రోమాంఛితమైన ప్రదర్శనని అందించారు. 
 
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకున్న ఎందరో ఆశీనులై ఉన్న సభలో, కోట్ల రూపాయలు విలువ ఆడియో వీడియో సెట్టింగ్‌లో, వేలాదిమందిని ఒకచోట చేర్చిన సభలో, దేశం కాని దేశంలో ఒక ప్రపంచ స్థాయి వేదిక మీద తెలంగాణ పాట, బతుకమ్మ, బోనం, మొత్తంగా తెలంగాణ సమాజం గెలిచి నిలిచిన ఈ ప్రస్థానం ఉద్యమంలో పాలుపంచుకున్న ఎందరినో ఉద్వేగపూరితమైన ఆనందంలో ముంచెత్తింది.

శ్రీ తెలంగాణ పాటతో ప్రారంభమైన అమెరికా తెలంగాణ అసోసియేషన్ ప్రపంచ మహా సభల రెండవ రోజు వేడుకలు కూడా అత్యంత వైభవంగా జరిగినయ్. పునర్నిర్మాణం దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్న సమయంలో ATA తెలుగు - తెలంగాణ సంఘాల సమాఖ్యగా ఉద్భవించి ఏం చేయగలదో, ఎలా చేయగలదో తన అవసరం-ఆవశ్యకతని ప్రపంచానికి తెలియ చేసింది. తెలంగాణ చరిత్రలో తెలంగాణ అవతల జరిగిన పనుల్లో ఇదొక ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వేదిక మీద స్వచ్చమైన, సాంస్కృతిక, జానపద, సామాజిక, సంఘటిత, ప్రజాస్వామిక, తెలంగాణం గొంతెత్తి తన స్వీయ అస్తిత్వాన్ని చాటింది. 
 
ఊరు ఊరుకు ఒక సంఘం వెలసింది. వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి ఇప్పటికే 35 సంఘాలతో ఎంవోయూ సంతకం చేసి శక్తివంతమైన సంఘటిత శక్తిగా ఒక ఆశయం కోసం మమేకమైన సంఘాల సమాహారంగా ఉద్భవించింది అమెరికా తెలంగాణ సంఘం అని ప్రెసిడెంట్ రాంమోహన్ కొండా తెలియచేసారు. భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో తమ సహాయసహకారం అందిస్తాం అని, తెలంగాణ పునర్నిర్మాణంలో తమ పాత్రని బాధ్యతతో పోషిస్తామని తెలియ చేసారు.

కన్వీనర్ వినోద్ కుకునూర్ గారు మాట్లాడుతూ స్థాపించిన కొద్ది రోజులలోనే, అతి తక్కువ వ్యవధిలో ఎన్నో కష్టనష్టాలని అధిగమించి, స్పష్టమైన ప్రణాళికతో ప్రపంచ మహా సభలకు పూనుకోవడం సాహసోపేతమైన పనే అయినా, సంవత్సరాలు కష్టపడి చేసే ఈ పనులని విజయవంతంగా జరిపి ఒక బెంచ్ మార్క్ సెట్ చేయగలిగాం అని అన్నారు. కో-కన్వీనర్ నాగేందర్ గారు మాట్లాడుతూ రెండు నెలల్లో మా ముందున్న కొండంత పని అనితరసాధ్యంగా కనిపించింది. ఒక్కో చైర్, కో చైర్, వాలంటీర్ సహా అందరం అహోరాత్రాలు కష్టపడ్డాము. ఇప్పుడు పొందే ఆనందం చెప్పలేకుండా ఉంది. 
 
డెట్రాయిట్ తెలంగాణ కమిటీ, తెలంగాణ జాగృతి కో-హోస్ట్‌గా వ్యవహరించి తెలంగాణ మహాసభలు విజయవంతం కావడంలో తోడ్పడ్డాయి అని తెలియ చేసారు. ఇదే వేదిక మీద సహకరించిన అన్ని మిత్ర సంఘాలని ఆటా తెలంగాణ సత్కరించింది. కార్యక్రమంలో పని చేసిన, పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరినీ అభినందించింది. డెట్రాయిట్ తెలంగాణ కమిటీ ప్రెసిడెంట్ భుజంగ రావు, చైర్మన్ రాంగోపాల్ ఉప్పల గార్లు కార్యక్రమం విజయవంతం అయినందుకు ఆనందం వ్యక్తం చేసారు.

కల్వకుంట్ల కవిత, కడియం శ్రీహరి, స్వామి గౌడ్, కొప్పుల ఈశ్వర్ , నిరంజన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పసునూరి దయాకర్, ఆరూరి రమేష్, జీవన్ రెడ్డి, గదారి కిషోర్, కే విద్యా సాగర్ , బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ బిగాల, భాను ప్రసాద్ రావు, నారదాసు లక్ష్మణ రావు , కర్ణే ప్రభాకర్, తుల ఉమా, మధు యాష్కి, వి ప్రకాష్, పెద్దిరెడ్డి, ఎల్ రమణ, ఎస్ వెంకటేశ్వర్, కృష్ణ సాగర్, వినోద్ రెడ్డి, ఎలువాక రాజయ్య ఇంకా ఎంతోమంది ప్రముఖ రాజకీయ ప్రజాస్వామిక వాదులు, నాయకులు సభలలో పాల్గొని తమ అనుభవాలని, ఆలోచనలని, దిశా నిర్దేశికత్వాన్ని అందించారు.
 
ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ పాన్ అమెరికా స్థాయిలో అసోసియేషన్ స్థాపితమవడం, అది తెలంగాణది అవడం చాలా ఆనందంగా ఉన్నదనీ, ప్రభుత్వానికి ప్రవాసులకీ మధ్య “తెలంగాణ ఆటా సంఘాన్ని” ఒక వారధిలా వ్యవహరించమని కోరారు. ఎన్నో సమస్యల పోరాటంలో కూడా హింసకు తావులేని ప్రజాస్వామిక వ్యవస్థగా దేశంలో పేరు పొందిన తెలంగాణ సామాజిక వ్యవస్థ, దేశంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ ప్రవాస భారతంలో కూడా పురోగతిని సాధించాలని కాంక్షించారు.

స్వామి గౌడ్ మాట్లాడుతూ పుట్టిన ఊరుని, రుచులనీ మరచిపోనితనాన్ని కొనియాడారు. మొదటి రోజు బాంక్వెట్ కార్యక్రమంలో ఫుడ్ సమస్య ఏర్పడినపుడు డెట్రాయిట్ చుట్టుపక్కల ఉన్న ఇండియన్ రెస్టారెంట్లు అన్నీ కలిసి ఒక్కటై సమస్య పరిష్కరించుకున్న తీరు చూసినపుడు కనిపించిన భారతీయత అమోఘం అని మెచ్చుకున్నారు. తెలుగు వారం కూడా తెలుగులో తెలంగాణాని వెతుక్కున్నాం కానీ తెలుగుని ఎప్పుడూ వేరు చేయలేదనే విషయాన్ని విమర్శకులు అర్ధం చేసుకోవాలని సూచించారు. 
 
తెలంగాణ IT పాలసీ ప్రోగ్రాం ద్వారా IT సమావేశాలు, మిషన్ తెలంగాణ ప్రోగ్రాం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణ భాగస్వామ్యాలనీ మరియు ప్రవాసుల బాధ్యతలనీ, మిషన్ కాకతీయ ప్రోగ్రాం ద్వారా మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ రీసెర్చ్ విద్యావేత్తలు తాము తెలంగాణలో జరిపిన రీసెర్చ్ గురించి ప్రభుత్వ ప్రవాసుల భాగాస్వామ్యాల చర్చలు, ఎన్ఆర్ఐ వీఎ ద్వారా ప్రవాసుల సమస్యలు ప్రణాళికల చర్చ, ఆటా కృషి ప్రోగ్రాం ద్వారా వ్యవసాయ చర్చ, పొలిటికల్ ఫోరం ప్రోగ్రాం ద్వారా రాజకీయ సమస్యల చర్చలు, ఎన్ఆర్ఐ తెలంగాణ రాష్ట్ర సమితి చర్చలు జరిగినాయ్. 
 
తెలుగు సినిమా తోటలో తెలంగాణ పాట, పల్లె పాట, వాయిస్ ఆఫ్ ఆటా తదితర పాటల పోటీల ఫైనల్స్ జరిగాయి. తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి సారథ్యంలో బోనాలు, ఎల్లమ్మ జాతర నృత్యం ప్రదర్శితమయ్యాయి. రసమయి, వారి బృందం ధూమ్ ధాం, ధమాక మరియు మరెన్నో కార్యక్రమాల ద్వారా తెలంగాణ జన జానపదాలని అమెరికా తీసుకవచ్చి డెట్రాయిట్ వేదిక ద్వారా సగర్వంగా పూర్తిస్థాయి తెలంగాణ ఆట పాటల ప్రదర్శన చేసి తెలంగాణ తలెత్తుకుని పాటకున్న శక్తి ఏంటో రుజువు చేసాడు. గోరటి ఎంకన్న తెలంగాణ మట్టి పరిమళాన్ని, మట్టి మనుషుల ఆత్మీయతని పట్టి తెచ్చి అమెరికా నడిబొడ్డున పాటల కోయిలై తన రాగాలు పలికించాడు.
 
మిట్టపల్లి సురేందర్, కార్తీక్, రామాచారి గ్రూప్ మరెందరో గాయకులు సభని అలరించారు. రసమయి బృందం, గిరిధర్ నాయక్, రోల్ రిదా, పద్మజా గారి శక్తి డాన్స్, కళారత్న శ్రీ కేవీ రత్న గారి గోదా కల్యాణం కూచిపూడి నృత్యం, సౌత్ ఇండియన్ జానపద నృత్యాలు, ఆల్ కమిటీ ఇంట్రడక్షన్ డాన్స్ తదితర ఎన్నో నృత్య కార్యక్రమాలు ప్రేక్షకులని అలరించాయి. కసి రెడ్డి వెంకట్ రెడ్డి గారు రాసిన “తెలంగాణ యాస భాష” మరియు “బతుకమ్మ సంస్కృతి” రెండు పుస్తకాలని కల్వకుంట్ల కవిత గారు ప్రపంచ మహా సభల వేదిక మీద ఆవిష్కరించారు.

సంగీత దర్శకుడు కీర్తి చక్రికి నివాళిగా చక్రి పాటల సమాహారాన్ని తయారుచేసి అద్భుతంగా ఆలపించారు ఫణి వంశీ మరియు స్వేతలు. రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ రాష్ట్ర సమితి ఫౌండింగ్ సభ్యులు వీ ప్రకాష్ రాసిన “హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్స్” పుస్తకాన్ని కవిత, స్వామి గౌడ్, కడియం శ్రీహరి, నిరంజన్ రెడ్డి, మరియు ఆటా ప్రెసిడెంట్ రాం మోహన్ కొండా, కన్వీనర్ వినోద్ కుకునూర్, కో కన్వీనర్ నాగేందర్ ఐత సమక్షంలో ఆవిష్కరించారు. 
 
సాయంత్రం జరిగిన అనుప్ రూబెన్స్ మ్యూసికల్ ప్రోగ్రాం ఆద్యంతం నభూతో నభవిష్యత్ అన్న చందంగా సాగింది. రనినా రెడ్డి, కౌసల్య, పృథ్వీ చంద్ర, ధనుంజయ్, రోల్ రిదా, మాళవిక తదితర గాయకులు పాల్గొని చివరి వరకూ ప్రేక్షకులని సమ్మోహితుల్ని చేశారు. అనుప్ రూబెన్స్ ఆటా కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాటని ఆలపించి గాయకులు ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసారు. ఆట పాటల్లో ప్రేక్షకులని భాగస్వాములని చేసి అనుప్ రూబెన్స్, తన బృందం చేసిన మ్యూసికల్ నైట్ ఖరీదయిన సౌండ్ సెట్టింగ్‌లో ఇంటర్నేషనల్ లైవ్ కాన్సేర్ట్ స్థాయిలో విజయవంతం అయింది. కార్యక్రమం అర్థరాత్రి రెండు వరకూ తీరిక లేకుండా కొనసాగింది.