శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

మహా శివరాత్రి.. రుద్రాక్ష ధారణ - మారేడు దళము మరిచిపోవద్దు..

మహా శివరాత్రి రోజున .. రుద్రాక్ష ధారణ - మారేడు దళము మరిచిపోవద్దు.. అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. భస్మముతో పాటు రుద్రాక్షలు చాలా గొప్పవి. తపస్సు చేస్తున్న శంకరున కన్నుల వెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లుగా మారాయి.

అందుచేత అవి ఈశ్వరుని తపశ్శక్తితో కూడిన కంటి నీటి బిందువుల నుంచి ఉద్భవించినవి. నేపాల్ ఖాట్మండ్ పశుపతినాథ దేవాలయంలో రుద్రాక్ష చెట్టు వుంది. అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు వుంటాయి. అందులో ఆరు ముఖాలున్న రుద్రాక్షలు కేవలం సుబ్రహ్మణ్య స్వరూపమని పెద్దలు నమ్ముతారు. 
 
అలాగే మారేడు దళాన్ని కూడా మరిచిపోకూడదు. మహాశివరాత్రి రోజున మారేడు దళమును పూజ చేసేటప్పుడు కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకండా ఈనెను పట్టుకుని శివలింగం మీద వేస్తారు. శివరాత్రి రోజున మారేడు దళముతో పూజ చేసే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఆ రోజున మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. 
 
అలాగే మన మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అందులో మొదటిది తప్పకుండా భస్మధారణ చేయడం, రెండోది రుద్రాక్ష మెడలో వేసుకోవడం, మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన చేయడం మరిచిపోకూడదు. ఈ పనులను ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.