1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Padmini Ekadashi 2026: Date, parana time, puja rituals and significance

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

Lord Vishnu
Lord Vishnu
పద్మిని ఏకాదశి ఈ ఏడాది విశేషం కానుంది. ఈ ఏడాదిలో ప్రస్తుతం అధిక జ్యేష్ఠ మాసం నడుస్తున్న సందర్భంగా పద్మిని ఏకాదశి 27న వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటారు. మూడేళ్లకి ఒకసారి వచ్చే ఈ అరుదైన ఏకాదశి భక్తులకు ఎంతో మంచి చేస్తుంది. శుభ ఫలితాలను అందిస్తుంది. ఇంకా దీనిని కమల ఏకాదశి లేదా పురుషోత్తమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని కొలిచే వారికి సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. 
 
శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైన అధిక మాసం అంటే జ్యేష్ఠం కాబట్టి ఈ మాసానికి పురుషోత్తమ మాసమని పేరు వచ్చింది. పద్మిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజు స్వామిని తులసి దళాలతో, పసుపు రంగు పూలతో, కలువ పూలతో చక్కగా అలంకరించుకోవాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. అనంతరం శ్రీ మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించాలి. 
 
అలాగే ఈ రోజు తులసి దళాలతో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభప్రదం. పూజ పూర్తయ్యాక కొబ్బరికాయ, అరటిపండ్లు, చక్రపొంగలి వంటి నైవేద్యాలు సమర్పించాలి. సాయంకాలం సంధ్యా సమయంలో సమీపంలోని విష్ణువు ఆలయానికి వెళ్లి తులసి మాల సమర్పించాలి. ఈ రోజు రాత్రంతా నిద్రపోకుండా శ్రీమన్నారాయణుని భజనలు, కీర్తనలతో జాగారం చేయాలి. మరుసటి రోజు ద్వాదశి పారణ చేసుకోవాలి. 
 
భక్తితో ఈ వ్రతాన్ని పాటిస్తే అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పద్మిని ఏకాదశి రోజు ఉపవాసం వ్రతం ఆచరించి శ్రీ మహా విష్ణువును పూజించిన వారు అన్ని రకాల యాగాలు, తపస్సు చేసిన ఫలితాలు పొందుతారని శాస్త్రవచనం. పెళ్లికాని అమ్మాయిలు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, పూజ చేయడం వల్ల మంచి భర్త లభిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా పేదలకు అన్నదానం, దానధర్మాలు చేయడం విశేష పుణ్యాన్ని అందిస్తుంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి