గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

అపారమైన విశ్వాసం... అద్భుతాల సమాహారం

WD
ఆయన చేయి చాపితే చాలు.... శివలింగం ప్రత్యక్షం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక నేతగా భక్తుల నీరాజనాలందుకుంటున్న ఆయన...చిటికె వేస్తే చాలు విభూతి రాలుతుంది. మీరు ఊహించింది నిజమే... ఆయనే సత్యసాయిబాబా... ఈ వారం ఏది నిజం శీర్షికలో సత్యసాయిబాబాను మీకు పరిచయం చేస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా, ప్రశాంతి నిలయం (పుట్టపర్తి) పట్టణంలో నివాసం ఉంటున్నప్పటికీ, సత్యసాయిబాబాను అంతర్జాతీయ ఆధ్యాత్మిక నేతగా భక్తులు కొలుస్తుంటారు. అదే క్రమంలో సత్యసాయిబాబాకు పలు అద్భుతాలు, విశ్వాసాలు ఆయన అనుయాయులు ఆపాదిస్తుంటారు. భక్తుల బాధలను స్వీకరించి వారి ఈతిబాధలను తీర్చే భగవత్‌స్వరూపునిగా బాబాను నమ్మినవారు త్రికరణ శుద్ధిగా చెప్తుంటారు. మానవాతీతమైన అద్భుతాలకు ప్రశాంతి నిలయం ప్రపంచ వ్యాప్తంగా పేరొందడానికి సత్యసాయిబాబానే కారణమని తెలుపుతుంటారు.
మీరు కూడా దైవ స్వరూపులే...
  “నేను దేవుడిని. మీరు కూడా దైవస్వరూపులే. ఈ విషయం నాకు సంపూర్ణంగా అవగతం కాగా మీరు పూర్తిగా అవగతం చేసుకోలేదు. ఇదే మీకు నాకు గల వ్యత్యాసం."      


విభూతి, తినుబండారాలు, బంగారపుటుంగరాలు, స్వర్ణశోభితమైన కంఠహారాలు ఇత్యాది వాటిలో ఏదో ఒకదానిని కరకమలాల నుంచి సృష్టించి బాబా భక్తులకు అందిస్తుంటారు. ప్రతిరోజూ తన దర్శనార్థం విచ్చేసే భక్తులకు పైన పేర్కొన్న వస్తువుల్లో ఏదో ఒకదానిని ప్రసాదంగా ఇవ్వడం బాబా దినచర్యలో ఒక భాగమని భక్తులు చెప్పుకుంటుంటారు.

వేర్వేరు ప్రదేశాల్లో ఒకేసారి దర్శనమివ్వడం, శారీరకంగా అదృశ్యం కావడం, రాతిని చక్కెరగా మార్చడం, నీటిని వేరే పానీయంగా మార్చడం, నీటిని పెట్రోల్‌గా మార్చడం, కోరిన వస్తువులను సృష్టించడం, ధరించి ఉండగానే తన వస్త్రాల వర్ణాన్ని ఇట్టే మార్చడం, ఆహారాన్ని రెట్టింతలు చేయడం, వ్యాధుల నివారణ, దృశ్యాలు, స్వప్న సాక్షాత్కారం, వృక్షానికి సహజాతిసహజమైన పండ్లకు బదులుగా వేరే పండ్లను సృష్టించడం, వాతావరణాన్ని నియంత్రించడం, ఇతర దేవతల స్వరూపంలోకి శారీరకంగా మారిపోవడం, శరీరం నుంచి కాంతిని వెలువరించడం తదితర సత్యసాయిబాబా లీలలను గురించి భక్తులు విశేషంగా కీర్తిస్తుంటారు.
WD


అయితే అద్భుతాలను సృష్టించడం దైవిక శక్తిలో ఒక భాగమని సత్యసాయిబాబా వివరిస్తుంటారు. కానీ తన అద్భుతాలను శాస్త్రీయమైన కోణంలో పరిశోధించేందుకు ఆయన సుతరామూ అంగీకరించరని హేతువాదులు ఆరోపిస్తుంటారు. హస్తలాఘవంతోనే బాబా వస్తువులను సృష్టిస్తుంటారని విమర్శకులు చెప్తుంటారు. బాబా మహత్మ్యాల వెనుక ఆరోపణలను కొన్ని భారతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించిన వైనాన్ని విమర్శకులు ప్రధానంగా ప్రస్తావిస్తుంటారు.
WD
భారత స్వర్ణ నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ బాబా స్వర్ణాభరణాలను సృష్టిస్తున్నారంటూ కొందరు వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే వారి కేసును న్యాయస్థానం కొట్టివేసింది. కానీ న్యాయపరిధిలో ఆధ్మాత్మిక శక్తిని డిఫెన్స్‌గా గుర్తించకూడదనే ప్రాతిపదికన వారు అప్పీలు చేసుకున్నారు. సత్యసాయిబాబా అద్భుతాలు అనగా నోటి నుంచి శివలింగాన్ని సృష్టించడం తదితరాలను అదేరకంగా చేసి చూపే రహస్య స్వామి డాక్యుమెంటరీని సైతం వారు ప్రదర్శించారు. సత్యసాయిబాబాకు మానవాతీత శక్తులు ఉన్నాయంటూ ఆయన విమర్శకులు కూడా విశ్వసిస్తున్న అంశాన్ని వారు నివేదించారు.

ఇక అతి ముఖ్యమైన సంఘటన 2007 సంవత్సరం అక్టోబర్ మాసంలో చోటు చేసుకుంది. ఆ సమయంలో పుట్టపర్తిలో స్థానికంగా గల విమానాశ్రయం వద్ద విశ్వరూప దర్శనం అనగా చంద్రునిలో కనిపిస్తానని ప్రకటించినట్లు వార్తలు వెలువడినాయి. భక్తులు భారీ సంఖ్యలో విమానాశ్రయం సమీపానికి చేరుకున్నారు.

అయితే చందమామను మేఘాలు ఆవరించడంతో అద్భుతం ఆవిష్కృతం కాలేదు. తిరిగి ప్రశాంతినిలయం చేరుకోవడానికి బాబా గంటకుపైగా వేచి ఉండవలసిన పరిస్థితి తలెత్తింది. నిరాశచెందిన ప్రజాసమూహాన్ని చెదరగొట్టేందుకు పోలీసు అధికారులు నానా తంటాలు పడవలసి వచ్చింది. అద్భుతం జరగకపోవడంపై సత్యసాయి ట్రస్ట్ ఎటువంటి వివరణను ఇచ్చుకోలేదు. సత్యసాయిబాబా కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేందుకే ఈ తరహా ప్రచారం జరిగిందని బాబా భక్తులు పేర్కొన్నారు.
WD


“నేను దేవుడిని. మీరు కూడా దైవస్వరూపులే. ఈ విషయం నాకు సంపూర్ణంగా అవగతం కాగా మీరు పూర్తిగా అవగతం చేసుకలేదు. ఇదే మీకు నాకు గల వ్యత్యాసం." ఆయనలోని దైవత్వాన్ని గురించి, ఆయన చేసే అద్భుతాలను ఆరా తీసే వారికి భగవాన్ సత్యసాయిబాబా ఇచ్చే సమాధానం ఇది. వెబ్‌దునియా పాఠకులుగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.