శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (15:21 IST)

వరి వంగడాల బియ్యంతో శ్రీవారికి నైవేద్యం.. మళ్లీ ఆ కాలం నాటి పద్ధతి..?

organic rice for Lord venkateswara
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంకు ప్రతినిత్యం లక్షలాది సంఖ్యలో భక్తులు శ్రీనివాసుడి దర్శనార్ధం దేశ, విదేశాల నుండి వస్తుంటారు. గంటల తరబడి వేచి ఉండి క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దివ్యమంగళ స్వరూపం కోసం పరితపించి పోతుంటారు. వేలాదిగా తరలివచ్చే భక్తులతో ఏడు కొండలు గొవింద నామస్మరణలతో మారుమ్రోగుతుంటుంది. స్వామి వారు ఎంతటి అలంకార ప్రియుడో, అంతటి నైవేద్య ప్రియుడు కూడా.
 
అందుకే శ్రీవారి ఆలయంలోని నైవేద్య పోటులో సాంప్రదాయబద్దంగా తయారు చేసిన వివిధ రకాల నైవేద్యాలను స్వామి వారికి సమర్పిస్తుంటారు అర్చకులు. పూటకొక్క వంటకంతో స్వామి వారికి ఎంతో భక్తి భావంతో అర్చకులు నైవేద్యాలు సమర్పిస్తూ..స్వామి వారిని సంతృప్తి పరుస్తారు. అయితే గతంలో ఆనవాయితీగా 365 రకాల దేశీయ వరి వంగడాల బియ్యంతో స్వామి వారికి నైవేద్యం సమర్పించే వారు. ఆ తర్వాత ఈ పద్ధతి నిలిచిపోయింది. అయితే ఇన్నాళ్లకు ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలని టిటిడి తీసుకున్న నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
దేశంలోనే అతి పెద్ద ధార్మిక సంస్దగా టీటీడీ పేరుపొందింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా పేరు గాంచిన వడ్డి కాసులవాడి ఆలయ పాలనా బాధ్యతలు నిర్వర్తించేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం 1933లో... కమిషనర్ల నేతృత్వంలో నడిచే పాలకమండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది. మళ్లీ 1951లో చేసిన హిందూ మత చట్టం ప్రకారం కమిషనర్లందరినీ కార్యనిర్వాహక అధికారులు (ఈవో)గా మార్చింది. 
 
బ్రిటీష్ వారి పాలనకు ముందు 365 రకాల బియ్యంతో చేసిన ప్రసాదాన్ని స్వామి వారికి నివేదించే విధానంను అనుసరిస్తుండగా, కాలక్రమేణ ఈ సంప్రదాయానికి అప్పటి పాలకులు స్వస్తి పలికారు. అయితే శ్రీవారి ఆలయంలో స్వయంబుగా కొలువైయున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించే నేవేధ్యాలు అన్ని ఇన్ని కావు.. నిత్యం మూడు పూటలా 195 కిలోల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు అర్చకులు.. దేశీయ విత్తనాలతో ప్రకృతి సిద్దంగా పండిన బియ్యంతో తయారు చేయబడిన నైవేద్యాన్ని సమర్పించే క్రతువు ఆలయ అధికారులు, ప్రధాన అర్చకుల సమక్షంలో ప్రారంభంకానుంది.
 
ఇందుకు కావాల్సిన దేశీయ వంగడాల బియ్యంను కృష్ణా జిల్లా, గూడూరు మండలం, పినగూడూరులోని సౌభాగ్య గోశాల, సేవ్ సంస్థ నిర్వాహకుడు ప్రకృతి వ్యవసాయవేత్త ఎం. విజయరాం ఈ సాంప్రదాయంకు తిరిగి రూపకల్పన చేశారు. గురువారం మధ్యాహ్నం కృష్ణా జిల్లా నుండి 15 రకాల ప్రకృతిసిద్ధ బియ్యంతో వాహనం తిరుమలకు చేరుకుంది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో దేశీయ వరి వంగడాలతో పండించిన బియ్యం, కూరగాయలను టిటిడి అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డికి తిరుమల శ్రీవారికి విరాళంగా అందాయి. కృష్ణా జిల్లా పినగూడురులంకకు చెందిన రైతు శ్రీ విజయరామ్ ఈ మేరకు బియ్యం, కూరగాయలను శ్రీవారి ఆలయం ఎదుట టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
 
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో దేశీయ వరి వంగడాలతో పండించిన బియ్యంతో శ్రీవారికి నైవేద్యం సమర్పించాలని రైతు విజయరామ్ టిటిడి ఛైర్మన్‌, ఈవోను సంప్రదించారని టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. 
 
ఈ మేరకు మొదటగా 10 రోజుల పాటు స్వామివారికి నైవేద్యం పెట్టే అన్నప్రసాదాల తయారీకి గానూ 2,200 కిలోల బియ్యం, కూరగాయలు, అరటిపండ్లు, బెల్లం, 15 కిలోల దేశీయ ఆవు నెయ్యి అందించారని తెలిపారు. ఈ బియ్యంలో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయన్నారు. శుక్రవారం నుంచి ఈ బియ్యంతో తయారు చేసిన అన్నప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తామని చెప్పారు.
 
ఈ బియ్యం కావాల్సిన మోతాదులో దొరికితే రైతుల నుండే నేరుగా సేకరించి స్వామివారికి నైవేద్యంతో పాటు భక్తులకు అందించే అన్నప్రసాదాల తయారీకి కూడా వినియోగిస్తామన్నారు. ఎరువులు, పురుగుల మందులు వాడకుండా పండించిన ఇలాంటి వ్యవసాయ ఉత్పత్తులను వాడితే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.