అస్సాంలో తిరుపతి నమూనాను పోలి ఉండేలా.. శ్రీవారి ఆలయం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో ప్రతిష్టాత్మక అడుగు ముందుకేసింది. ఈశాన్య భారత రాష్ట్రమైన అస్సాం ప్రభుత్వం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సారథ్యంలో టీటీడీకి అత్యంత విలువైన 10.33 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింది. అస్సాంలోని కామరూప్ జిల్లాకు చెందిన సోనాపూర్ రెవెన్యూ సర్కిల్ పరిధిలో ఈ భూమిని శ్రీ వేంకటేశ్వరస్వామివారి భవ్య ఆలయ సముదాయ నిర్మాణం కొరకు అధికారికంగా మంజూరు చేశారు.
ఈ కేటాయింపులకు సంబంధించి టీటీడీ అధికారులు గురువారం నాడు అస్సాం ప్రభుత్వ రెవెన్యూ అధికారుల నుండి సదరు భూమిని అధికారికంగా స్వాధీనం చేసుకున్నారు. అస్సాం మెట్రోపాలిటన్ డిప్యూటీ కమిషనర్ (DC) స్వయంగా అధికారిక భూ స్వాధీన ధృవీకరణ పత్రాన్ని టీటీడీ ప్రతినిధులకు అందజేశారు. తిరుపతి ప్రధాన ఆలయ నమూనాను పోలి ఉండేలా.. అచ్చమైన ద్రావిడ నిర్మాణ శైలిలో, కృష్ణశిలలతో ఈ అస్సాం శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నారు.
