బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu
Last Modified: గురువారం, 9 అక్టోబరు 2008 (16:23 IST)

అష్టాదశ శక్తి పీఠం... జ్వాలాముఖి క్షేత్రం

హిమాలయాల ప్రాంతంలో వెలసిన విశేషమైన శక్తి కల్గిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పిలవబడుతున్నదే జ్వాలాముఖీ క్షేత్రం. అలనాడు పార్వతీ దేవి నాలుక పడిన ప్రదేశంగా భక్తులు విశ్వసించే ఈ ప్రాంతంలో తొమ్మిది జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుండడం విశేషం.

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఈ జ్వాలాముఖి క్షేత్రం కొలువై ఉన్న ఈ క్షేత్రం అత్యంత మహిమగల క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు.

జ్వాలాముఖి విశేషాలు
శక్తి పీఠాల్లో ముఖ్యమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో నిత్యం వెలుగుతూ ఉండే జ్యోతులు ఎలా వెలుగుతున్నాయనే అంశం నేటికీ ఓ మిస్టరీనే. ఈ మిస్టరీని తెల్సుకునేందుకు ప్రయత్నించినవారికి ఇది ఓ అంతబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. ఎలాంటి ప్రకృతి విపత్తులకు సైతం ఈ జ్యోతులు ఆరిపోక పోవడం గమనార్హం.

ప్రపంచంలోని ఏ పుణ్యక్షేత్రంలో కూడా ఇలా నిరంతరం వెలిగే జ్యోతులు లేకపోవడం గొప్ప విషయమని స్థానికులు చెబుతారు. జ్వాలాముఖిలో అమ్మవారు జ్వాల రూపంలో ఉండడం వల్ల జ్వాలా దేవి అనే పేరుతో పిలవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఇక్కడ కొలువైన శివున్ని ఉన్నత భైరవుడనే పేరుతో పిలుస్తారు.


జ్వాలాముఖిలో శివుడు అంబికేశ్వర మందిరంలో కొలువై ఉన్నాడు. జ్వాలాముఖి చారిత్రక విశేషాలు జ్వాలాముఖిలో జ్వాలలు ఎలాంటి ఇంధన సరఫరా లేకుండా వెలుగుతుండడానికి కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించి శాస్త్రవేత్తలు సైతం విఫలమయ్యారట. ఈ ఆలయం యొక్క విశేషాలు విని ఆనాడు అక్బర్ చక్రవర్తి ఈ దేవాలయానికి బంగారు గొడుగును సమకూర్చారట.

అలాగే ఈ కాలంలో కొందరు జ్వాలాముఖిలో వెలిగే జ్యోతులను ఆర్పి వేయడానికి సకల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారట.

జ్వాలాముఖి ఆలయ విశేషాల
జ్వాలాముఖీ ఆలయం ఎత్తైన పర్వత ప్రాతంలో కొలువై ఉంది. కింది నుంచి ఆలయాన్ని చేరుకునేందుకు దాదాపు 200 మెట్లు ఉంటాయి. జ్వాలాముఖిలో అమ్మవారికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వడం జరుగుతుంది. తొలి హారతిని సూర్యోదయం సమయంలోను రెండో హారతిని అటుపై రెండు గంటల తర్వాత ఇస్తారు.

ఇక మూడవ హారతిని మధ్యాహ్నం ఇస్తారు. నాలుగో హారతిని సుర్యాస్తమ సమయంలోనూ ఐదవ హారతిని రాత్రి తొమ్మది గంటల ప్రాంతంలోను ఇస్తారు. జ్వాలాముఖీ క్షేత్రంలో రెండు నుంచి 10 ఏళ్ల లోపు కన్యలైన ఆడపిల్లలను దేవీ స్వరూపంగా ఎంచి పూజలు చేస్తారు.

ఇలా చేయడం వల్ల దారిద్ర్యం తొలిగి పోతుందని, దుఃఖ, శత్రు నాశనం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జ్వాలాముఖిలో ఉన్న తొమ్మిది జ్యోతులను వివిధ పేర్లతో పిలవడంతో పాటు వీటిని పూజిస్తే వివిధ రకాలైన ప్రయోజనాలు చేకూరుతాయని కూడా భక్తులు విశ్వసిస్తారు.