శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Ganesh

ఇండియన్ వాటికన్ "శ్రీరంగం" శోభాయమానం..!

FILE
ఆళ్వారుల దివ్వ ప్రబంధాలకూ, రామానుజుని శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన పవిత్ర వైష్ణవ పుణ్యక్షేత్రం "శ్రీరంగం". "ఇండియన్ వాటికన్"గా పేరు పొందిన ఈ ఆలయం భారతదేశంలోని వైష్ణవ ఆలయాల్లోకెల్లా పెద్దది, సుందరమైనది. శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువైయున్న ఈ దివ్యక్షేత్రం.. తమిళనాడులోని తిరుచ్చికి ఆనుకుని ఉండే ఉభయ కావేరీ నదుల మధ్యన విలసిల్లుతోంది.

భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సంకీర్ణాలలో ఒకటైన శ్రీరంగం ఆలయం.. 6,31,000 చదరపు మీటర్లు (156) ఎకరాల విస్తీర్ణంతో.. 4 కిలోమీటర్ల పొడవైన ప్రాకారంతో భాసిల్లుతోంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాంబోడియాలోగల అంగ్‌కోర్ వాట్ దేవాలయం నేడు శిథిలావస్థలో ఉంది కనుక.. ప్రపంచంలో పూజాధికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం "శ్రీరంగం" ఆలయమేనని ఆలయ వెబ్‌సైట్ పేర్కొంటోంది.

కావేరీ నది, దాని ఉపనది కొలిదం మధ్యలో విస్తరించిన శ్రీరంగం ఒక ద్వీపంలా ఉంటుంది. శ్రీరంగ పట్టణంలో దేవాలయం ఉండడం కాక.. శ్రీరంగం దేవాలయంలోనే పట్టణం ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ అతిపెద్ద ద్రవిడ దేవాలయ గర్భాలయంలో విష్ణుమూర్తి ఆదిశేషుడిపై పక్కకి వరిగి శయనించిన భంగిమలో దర్శనమిస్తుంటాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం నాలుగు దశాబ్దాలపాటు అభివృద్ధి చెందింది.

ఈ ఆలయాన్ని మొదటిసారి పదో శతాబ్దంలో నిర్మించగా.. అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తానుగా ఉన్నప్పుడు ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశాడు. ఆ తరువాత 1771వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. అయితే ప్రస్తుతం ఉండే రంగనాథ ఆలయాన్ని 17వ శతాబ్దంలో నాయక రాజులు పునర్నిర్మించారు. దీని దక్షిమ మహాద్వారం 1987లో పూర్తి చేశారు.

శ్రీరంగంలో గర్భగుడి కేంద్రంగా ఎనిమిది దీర్ఘచతురస్రాకారపు ప్రాకారాలు ఒకదానిలోపల మరొకటి ఉన్నాయి. 15వ శతాబ్దందాకా ఈ ప్రాకారాలు ఏ కప్పూ లేకుండా ఉండేవి. లోపలి ఐదు ప్రాకారాలనూ ఆలయం లోపలి భాగాలుగా, బయటి మూడు ప్రాకారాలను నగరంగా, నివాస స్థలాలుగా తీర్చి దిద్దారు.

ఆలయంలోని అపూర్వ మంటపాలు, కట్టడాలు 17, 18 శతాబ్దాలలో నిర్మాణమయ్యాయి. శ్రీరంగంలో మొత్తం 21 గోపురాలుండగా.. తూర్పున ఉన్న గోపురంలో ముఖ్యమైన దేవుడిని ప్రతిష్టించారు. దీర్ఘచతురస్రాకారంగా ఉండే ఈ పీఠమే మొత్తం దేవాలయానికి గర్భగుడిగా, మూల స్థానంగా ప్రాచుర్యంలో ఉంది.

FILE
గర్భగుడిలోని పీఠం బంగారు పూతపూసిన విమానం, దానిపై శేషసాయి ప్రతిమ ఉంటుంది. ఈ శేషసాయినే శ్రీరంగనాథుడిగా భక్తులు కొలుస్తుంటారు. ఆలయానికి ప్రవేశించే ద్వారాన్ని అర్చన సమయంలో తెరుస్తారు. ఆ సమయంలోనే భక్తులు లోనికివెళ్లి తమ మొక్కలను తీర్చుకుంటుంటారు. ఇక ఆలయం ప్రధాన ఆకర్షణ "శేషగిరి రాయర్ మంటపం". దీనిని నాయకరాజులు రూపొందించారు.

కత్తులు దూసిన యుద్ధసైనికులు గుర్రాలపై ఉండే అపురూపమైన శిల్పాలు ఇక్కడ అగుపిస్తాయి. పల్లవరాజుల శిల్పకళా వైభవానికి తార్కాణాలుగా నిలిచిన అనేక శిల్పాలతో కూడిన స్తంభాలు ఇక్కడ కనువిందు చేస్తాయి. ముఖ్యంగా ఇక్కడుండే వేణుగోపాలుడి ఆలయం చొక్కనాథుని కళానైపుణ్యానికో మచ్చుతునక మాత్రమే..!

"గరుడమంటపం" ఇక్కడి మరో ప్రత్యేక విశేషం. దీనిని ఆనుకొని "సూర్యపుష్కరిణి", దానికి ఎదురుగా "చంద్రపుష్కరిణి" ఉన్నాయి. ఈ రెండింటికి పైకప్పు ఉంది. నగరాన్ని, నగర ప్రజల్ని సదా కాపాడుతూ ఉండే హిందూ దేవుళ్ళకు ఈ దేవాలయాన్ని అంకితమిచ్చారు. ఇక్కడ నిరంతరం శాస్త్రీయ సంగీత కచేరీలు జరుగుతూ ఉంటాయి.

ఇక్కడ నిర్వహించే ప్రముఖుల అనుగ్రహ భాషణాలకు వచ్చే విశేష ప్రజలందరికీ సరిపడా విశాలమైన మంటపాలు ఉన్నాయి. కావేరీ నదిలో చిన్నచిన్న పడవలలో సాయంత్రం పూట షికారుకు వెళ్ళవచ్చు. ఈ దేవాలయ నగర సందర్శనం.. తీర్థయాత్రికుల, భక్తుల మనస్సుల్లో అపురూపంగా మిగిలిపోతుంది.

ఈ దేవాలయ పట్టణంలో దేవుళ్ళూ, దేవాలయాలూ మాత్రమే కాకుండా అర్చకులకీ, గృహస్తులకీ, యాత్రికులకీ, భక్తులకీ అనేక వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వీరందరికీ ఆహారాల్ని, ప్రసాద సౌకర్యాల్ని కల్పించడానికి అనేక పాకశాలలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న కళ్యాణ మండపాలలో ఏ ఉత్సవాలు జరిగినా భక్తుల దర్శనం నిమిత్తం దేవతా విగ్రహాలను తీసుకొచ్చి వాటిలో అధిష్టింపచేస్తారు. ప్రజలకు, భక్తులకు యాత్రికులకు అవసరమైన నీటిని అదించే ఎన్నో చెరువులూ, బావులూ ఇక్కడ ఉన్నాయి.

శ్రీరంగం పట్టణానికి అనేక వైపులనుంచి ప్రయాణ సౌకార్యాలు ఉన్నాయి. ఉత్తర తిరుచ్చికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ దేవాలయం చెన్నై-మధురై ప్రధాన మార్గంలో ఉంది. చుట్టు ప్రక్కల ఉన్న పట్టణాల నుంచే కాక.. కర్ణాటక రాష్ట్రంలోని అనేక పట్టణాల నుంచి కూడా సరాసరి బస్సు సౌకర్యం ఉంది. చెన్నై నుంచి ప్రతి రోజూ విమాన సౌకర్యం ఉంది.