శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Ganesh

మమ్మేల రావయ్యా.. శ్రీశైల మల్లయ్యా..!!

FILE
కేదారంలో స్నానం చేసినా, కాశీలో మరణించినా పునర్జన్మ ఉండదంటారు. అలాంటిది శ్రీశైల శిఖర దర్శన యాత్రతోనే ముక్తి కలుగుతుందని ప్రతీతి. అందుకే "స్పర్శవేదుల రాశి ప్రత్యక్ష రాశి" అని పేరు పొందిన శ్రీశైల యాత్రకు, శిఖర దర్శనానికి భక్తులు రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. ఎన్నిసార్లు చూసినా తనివితీరని ఈ దివ్య పుణ్యక్షేత్రాన్ని దర్శించి భక్తిభావంతో పులకించి పోతుంటారు.

దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలాన్ని శ్రీ గిరి, శ్రీ పర్వతం, శ్రీ నగరం అని కూడా పిలుస్తుంటారు. శ్రీశైల శిఖరంమీద మల్లికార్జున స్వామి స్వయంభూ లింగమై వెలిశాడు. భారతదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల మల్లికార్జున లింగం ఒకటి. అలాగే దేశంలో ఉన్న అష్టాదశ మహాశక్తి పీఠాలలో శ్రీశైల భ్రమరాంబికా శక్తి పీఠం రెండవదిగా పేరుగాంచింది.

ఆంధ్రరాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోగల నల్లమల అడవుల మధ్యన విరాజిల్లుతోంది శ్రీశైల క్షేత్రం. పరమపావనమైన కృష్ణానదీమతల్లి తీరంలో సముద్ర మట్టానికి పదిహేను వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ దివ్యక్షేత్రం. ఈ శ్రీశైల శిఖరం సముద్ర మట్టానికి 2830 అడుగుల ఎత్తులో ఉంది. కాగా.. శ్రీశైల స్వామి దర్శనం, శిఖర సౌందర్యం, శ్రీశైలం నలుపక్కలా పరుచుకొని ఉన్న ప్రకృతి రమణీయత యాత్రికులను అలౌకిక ఆనందంలో ముంచెత్తి వేస్తాయనటంలో ఆశ్చర్యం లేదు.
స్వామీ.. నన్ను పర్వత శిఖరంగా మార్చు..!
పర్వతుడు కూడా తపస్సు చేసి శివుడిని సాక్షాత్కరింప జేసుకున్నాడట. అప్పుడు "స్వామీ.. నన్నిలా ఉన్నట్లుగానే ఒక కొండగా చేసి, ఆ పర్వత శిఖరంపై దివ్య లింగాకారంలో నువ్వు నివసించు తండ్రీ.." అని కోరుకున్నాడట...


శ్రీశైల ప్రసక్తి స్కంధ పురాణంలోనూ, మహా భారతం వన పర్వంలోనూ ఉంది. శ్రీరామ చంద్రుడు వనవాస సమయంలో సీతాలక్ష్మణ సమేతుడై శ్రీశైలం వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పాండవులు కూడా శ్రీశైల స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపించినట్లు వాటి ద్వారా తెలుస్తోంది.

బౌద్ధయుగంలో కూడా శ్రీశైల ప్రసక్తి ఉన్నట్లు మహాయానానికి పూర్వంనుంచీ ప్రచారంలో ఉంది. చైనా యాత్రికులు ఫాహియాన్, హుయాన్‌త్సాంగ్‌లు తమ పర్యటనా అనుభవాలలో శ్రీశైలాన్ని గురించి కూడా పేర్కొన్నారు. పూర్వపు రాజులలో చాలామంది మల్లికార్జునస్వామి వారికి తమవంతుగా సేవగా యథాశక్తి శ్రీశైల అభివృద్ధికి కృషి చేసినట్లు తెలుస్తోంది.

శ్రీ కృష్ణ దేవరాయలు శ్రీశైల ఆలయాన్ని సందర్శించి రథోత్సవం జరిగే వీధిలో ఇరువైపులా ఎన్నో మందిరాలను కూడా కట్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఒక గోపురాన్ని నిర్మించినట్లు కథనం. అలాగే శ్రీ శంకరాచార్యులవారు శ్రీశైలంలో ఉండి కొన్ని రోజులపాటు తపస్సు చేసినట్లు చెబుతుంటారు. ఇక్కడే ఆయన భ్రమరాంబికా అష్టకాన్ని, శివానందలహరిని కూడా రాసినట్లు తెలుస్తోంది.

శ్రీశైల మల్లికార్జునుడి ఆవిర్భావం గురించి స్కంద పురాణంలోని ఓ కథ ఇలా చెబుతుంది. పూర్వం శిలానందుడనే మహర్షి పరమశివుడి గురించి తపస్సు చేసి, వరప్రసాదంగా నందీశ్వరుడు, పర్వతుడనే ఇద్దరు కుమారులను పొందాడట. పర్వతుడు కూడా తపస్సు చేసి శివుడిని సాక్షాత్కరింప జేసుకున్నాడట. అప్పుడు "స్వామీ.. నన్నిలా ఉన్నట్లుగానే ఒక కొండగా చేసి, ఆ పర్వత శిఖరంపై దివ్య లింగాకారంలో నువ్వు నివసించు తండ్రీ.." అని కోరుకున్నాడట.

FILE
వెంటనే పర్వతుడిని శివుడు అనుగ్రహించటంతో అతను ఒక పర్వత శిఖరంలా మారిపోవటం, శివుడు స్వయంభూ లింగాకారమై వెలయటం జరిగిపోయాయట. ప్రధమగణాలందరూ శ్రీశైలానికి చేరుకోవటంతో, అందరూ వెళ్లిపోయాక తాను మాత్రం ఇక్కడెందుకని అనుకున్న పార్వతిదేవి వెండికొండను వదలి భ్రమరాంబికాదేవి రూపంలో శ్రీశైలంలో అడుగుపెట్టిందనీ, కైలాసమే శ్రీశైలానికి తరలి రావటంతో అదో ప్రత్యక్ష కైలాసంగా, భక్తుల కల్పతరువుగా మారిపోయిందట.

జాతి, కుల, మత, వర్గ, లింగ, వయో బేధాలు లేకుండా శ్రీశైల స్వామివారి గర్భగుడిలోకి అందరూ ప్రవేశించి ఆయనను కనులారా దర్శించుకోవచ్చు. అందరి దేవుడైన స్వామివారిని నల్లమల ప్రాంతంలోని కొండల్లో నివసించే చెంచు ప్రజానీకం అల్లుడిగానూ, భ్రమరాంబికా దేవిని తమ కుమార్తెగానూ భావించి పూజలు చేస్తుంటారు. అందుకే వీరికి స్వామివారి సేవలో ప్రత్యేక ప్రాతినిధ్యం ఉంది. ఇప్పటికీ శివరాత్రి ఉత్సవాలలో స్వామి రథాన్ని లాగేది కూడా చెంచు ప్రజలే. వీరు స్వామివారిని ప్రేమగా చెంచు మల్లయ్య అని కూడా పిలుచుకుంటారు.

శ్రీశైల క్షేత్రానికి నాలుగు ద్వారాలు, ఎనిమిది శిఖరాలు, పదహారు గవాక్షాలు ఉన్నాయి. శ్రీశైల ఆలయంలో ఉన్న ప్రాకార శిల్పాలు చాలా అందంగా ఉంటాయి. ఆనాటి కళాకారులు ఈ ఆలయంపై శివుడు బిక్షాటన, గౌరీ కళ్యాణం, కిరాతార్జునీయం మొదలైన శివగాథలను మనోహర శిల్పాలుగా తీర్చిదిద్దటంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి. ఇక్కడి నటరాజస్వామి కంచు విగ్రహం మరో అపూర్వ కళాఖండం అంటే అతిశయోక్తి కాదు.

ఈ పుణ్యక్షేత్రంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో సాక్షిగణపతి ఆలయం, అగస్త్య మహర్షి తపస్సు చేసిన హటకేశ్వరం తదితరాలు ముఖ్యమైనవి. అలాగే ముకుందాశ్రమం, హటకేశ్వర నైమిశారణ్యం అనే పేర్లతో పిలవబడే రెండు ఆశ్రమాలు ఇక్కడ కనిపిస్తాయి. వీటికి సమీపంలో తూర్పువైపున పాలధార, పంచధారలు ఉన్నాయి. కొండ లోపలినుంచి రెండు నీటి ధారలు జాలువారుతూ ఉంటాయి. వాటినే పాలధార, పంచధార అని పిలుస్తుంటారు. ఈ ప్రదేశంలోనే ఆదిశంకరులు తపస్సు చేశారని స్థానికులు చెబుతుంటారు.

పైన చెప్పుకున్న ప్రదేశాలన్నింటినీ చూసి కొండమీద మరికొంతదూరం ముందుకెళితే సముద్ర మట్టానికి 2830 అడుగుల ఎత్తున ఉన్న శ్రీశైల శిఖర దర్శనానికి చేరుకోవచ్చు. ఇక్కడే నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్య నుంచి దూరంగా కనిపించే మల్లికార్జు దేవాలయ కలశాన్ని చూస్తే.. పునర్జన్మ ఉండని భక్తుల విశ్వాసం.

ఇక ఆలయం తరువాత చూడదగ్గ మరో ప్రదేశం శ్రీశైలం ప్రాజెక్టు. బ్రహ్మగిరి, విష్ణుగిరి కొండలమధ్య ఉరుకులు పరుగులతో కృష్ణవేణమ్మకు అడ్డుకట్ట వేయటంతో రూపొందిన అద్భుత ప్రదేశమే శ్రీశైలం ప్రాజెక్టు. ఇక్కడినుంచి బస్సులో మరింత కిందికి వెళితే పాతాళగంగ స్నానఘట్టానికి చేరుకోవచ్చు.

ఇవన్నీ ఒక ఎత్తయితే నాగార్జునసాగర్ శ్రీశైలం అభయారణ్యమే ఒక ఎత్తు. కృష్ణా నదీమతల్లికి ఇరువైపులా 3568 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ అభయారణ్యం ఖనిజ సంపదకు, వృక్ష సంపదకు నిలయం. ఇక్కడ ఔషధాలకు పనికివచ్చే వనమూలికలు కూడా ఇక్కడ విస్తారంగా లభిస్తాయి. ఇందులో జీవిస్తున్న వన్యప్రాణులను రక్షించేందుకు ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించి, సంరక్షిస్తోంది.