గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Munibabu

మల్లికార్జునుడి దివ్యక్షేత్రం శ్రీశైలం

కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల మధ్య శ్రీ భ్రమరాంభికాదేవి సమేతంగా మహాశివుడు శ్రీమల్లిఖార్జునుని రూపమున వెలసిన దివ్యక్షేత్రం శ్రీశైలం. భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ శైవ క్షేత్రం నిత్యం శివనామ స్మరణతో మార్మోగుతుంటుంది.

కొండల ప్రాంతంలో పచ్చటి అరణ్యం మధ్య కొలువైన ఈ క్షేత్రానికి చరిత్ర ప్రధాన్యము కలదు. పురాణ పురుషులైన పాండవులు, శ్రీరాముడు లాంటివారు శ్రీశైల మల్లిఖార్జునుడిని సేవించారని పురాణాలు పేర్కొంటున్నాయి. కీకారణ్యము మధ్యలో ఆనాడు రాజులు నిర్మించిన ఈ దేవాలయం ఈనాటికి చెక్కుచెదరక నిలవడం విశేషం.

నాలుగువైపులా ఉన్న అతిపెద్ద గాలిగోపురాలు, నాలుగువైపులా బ్రహ్మండమైన ద్వారాలు ఈ దేవాలయానికి అత్యంత శోభను చేకూర్చిపెట్టాయి. సువిశాలమైన నల్లమల కొండల్లో వెలసిన ఈ శైవక్షేత్రంలో చూచిన కొద్దీ తనివితీరని మరెన్నో విశిష్ట దర్శనీయ స్థలాలు ఉన్నాయి.

దేవాలయ విశేషాలు
శ్రీశైల క్షేత్రాన్ని దర్శించే భక్తులకు మల్లిఖార్జుని సన్నిధితో పాటు మరెన్నో విశేషాల కనువిందు చేస్తాయి. మల్లిఖార్జుని గర్భగుడి మాత్రం సాధారణమైన కట్టడంగా గోచరించినా ప్రధాన అలయానికి పక్కనే ఉన్న భ్రమరాంభికా దేవి ఆలయం అద్భుతమైన శిల్పకళతో భక్తులను ఆకట్టుకుంటుంది.

అమ్మవారి దేవాలయం వెనుకభాగాన ఉన్న గోడకు చెవిపెట్టి వింటే భ్రమరనాధం వినిపించడం విశేషం. స్వామివారి, అమ్మవారి దివ్వసన్నిధితో పాటు స్వచ్ఛమైన నీటిని కలిగిన మనోహర గుండము సైతం వీక్షించదగ్గదే. వీటి తర్వాత దేవాలయ ప్రాంగణములో గల పాండవుల దేవాలయాలు, మండపాలు చూడదగ్గ విశేషాలు.


ఇవికాక శ్రీశైల క్షేత్రానికి కొద్ది దూరంలో ఉన్న పాతాళగంగ, సాక్షిగణపతి ఆలయం, పాలధార, పంచధార ప్రాంతాలు, శివాజీ సాంస్కృతిక భవనం లాంటివి చూడదగ్గ ప్రాంతాలు.

శ్రీశైల క్షేత్రంలోని వసతి సౌకర్యాలు
శ్రీశైల క్షేత్రంలో భక్తుల వసతి సౌకర్యాలకు ఎలాంటి కొదవాలేదు. దేవస్థానంవారు నిర్వహిస్తున్న సత్రములతోపాటు ప్రైవేటువారిచే నడపబడు కాటేజీలు, హోటల్స్ కలవు. వీటితోపాటు అనేక కులలా సంఘాలవారు నిర్మించిన సత్రాలు అందుబాటులో ఉన్నాయి. ధరలు సైతం అన్ని వర్గాల భక్తులకు అందుబాటులోనే ఉండడం విశేషం.

శ్రీశైలంకు రవాణా సౌకర్యాలు
కొండప్రాంతంలో వెలసిన శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించాలంటే అడవుల గుండా, ఘాట్ రోడ్డులో ప్రయాణించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి శ్రీశైలానికి చేరుకోవచ్చు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు శ్రీశైలం దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే ఈ దారి అరణ్యం మధ్యలో ఉండడం వల్ల రాత్రి ప్రయాణం అనుమతించరు. అయితే ఇతర మార్గాల నుంచి శ్రీశైలం చేరాలనుకునేవారు కర్నూలు చేరుకుని అక్కడి నుంచి శ్రీశైలం చేరుకోవచ్చు.