శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. సముద్ర తీరాలు
Written By Ganesh

"తీరాలకు తీరాలనే" మింగేస్తున్న సముద్రాలు

FILE
"భూమి వేడెక్కినట్లయితే, సముద్రం ముందుకొస్తుందా..? ఇసుక తిన్నెలు మునిగిపోతాయా..?" అనే సందేహం మీకెప్పుడయినా కలిగిందా..? దీనికి సమాధానంగా "అవును" అనే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎన్నో అద్భుతాలను తనలో కలిపేసుకున్న కడలి.. దాని తీరప్రాంతాలను సైతం మింగేస్తోందని పలు పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

దీనికి ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోగల రామకృష్ణ బీచ్‌ను 20 సంవత్సరాల క్రితం చూసినవారు.. ఇప్పుడు చూసినట్లయితే "అదేంటి.. సముద్రం ఇంత దగ్గరికి వచ్చేసింది..?" అని నోరెళ్లబెట్టకమానరు. అయినప్పటికీ అది నిజం. వాతావరణంలోని మార్పుల వల్లనే సముద్రం తీరప్రాంతాలను తనలో కలిపేసుకుంటూ ముందుకొచ్చేస్తోంది.

భూ వాతావరణం వేడెక్కటంవల్ల కిలోమీటర్ల మేర తీర ప్రాంతం సముద్రంలో కలిసిపోతోంది. దాంతో సముద్రం ఇసుక తిన్నెలను తనలో కలిపేసుకుంటూ మునుముందుకు వచ్చేస్తోంది. ఈ మార్పు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరం అంతటా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సముద్ర మట్టం పెరుగుదల, మునిగిపోతున్న తీర ప్రాంతాల ఆచూకీ, అందుకు సంబంధించిన పరిశోధనలు పలు ఆసక్తికర అంశాలను బహిర్గతం చేస్తున్నాయి.
ఔషధ గుణాలతో మొక్కలు..!
ఈ పురాతన కోస్తా తీరం వద్దనే కొన్ని నదీపాయలను కూడా కనుగొనటమేగాక.. అవి బాహుదా నదికి చెందినవిగా పరిశోధకులు భావిస్తున్నారు. సముద్రంలోగల ఈ తీరంపై కొన్ని సముద్రజాతి మొక్కల ఎదుగుదల ఉన్నట్లు గమనించారు. ఇవి కొన్ని రోగ నిరోధక ఔషధాల తయారీలో ఉపయోగపడతాయని...


ఈ మేరకు విశాఖలోని జాతీయ సముద్ర విజ్ఞాన శాస్త్ర సంస్థ (ఏన్ఐఓ), భువనేశ్వర్‌లోని ప్రాంతీయ పరిశోధనశాల (ఆర్ఆర్ఎల్)లు సంయుక్తంగా జరిపిన పరిశోధనల్లో... సముద్ర తీరాలు కోతకు గురైనట్లు స్పష్టమవటమేగాకుండా, మట్టంలో వచ్చిన తేడావల్ల క్రమంగా కొన్ని తీరాలే కనుమరుగు అవుతున్నట్లు శాస్త్రవేత్తలు పసిగట్టారు. ఇలా మునిగిపోయిన మూడు సముద్ర తీరప్రాంతాలు ఒరిస్సా, విశాఖపట్నం తీరాల నడుమ ఉన్నట్లుగా వారు గుర్తించారు.

పద్దెనిమిది వేల సంవత్సరాల క్రితం సముద్ర తీరం ఇప్పుడున్న తీరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉండేదని.. విశాఖ నగర సమీపంలోగల యారాడ వద్ద కూడా తీరం ఇంతే దూరంలో ఉండేదని కూడా పై సముద్ర విజ్ఞాన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్రస్తుతం సముద్ర మట్టం నుంచి 30, 65, 90 మీటర్ల దూరంలో మూడు పురాతన కోస్తా ఇసుక తీరాలు మునిగిపోయినట్లుగా వారు ఈ పరిశోధనల్లో గుర్తించారు.

ఎకో సౌండర్, సిస్మిక్ పరికరాలతో చేపట్టిన సర్వేలలో వారు వీటిని గుర్తించారు. ఈ తీరాల వెంబడి కొన్ని నదీ పాయలు కూడా ఉన్నట్లు వారి పరిశోధనల్లో తేలింది. అంటే నదులు కూడా సాగరగర్భంలో అంతరించి పోతున్నాయని వీటి ద్వారా తెలుస్తోంది. కాబట్టి.. శతాబ్దాల క్రితం ఈ తీరంలో కలిసే నదుల పాయలుగా వాటిని గుర్తించి.. "పేలియో ఛానెల్స్"గా వాటికి నామకరణం చేశారు.

FILE
ఒరిస్సా తీరంలోని గోపాల్‌పూర్ నుంచి ఉత్తర కోస్తా తీరంలోగల బారువా వరకు సుమారు 25-30 మీటర్ల సముద్రంలోతు వద్ద ఇలాంటి ఓ పురాతన కోస్తా తీరం ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. కాగా.. ప్రస్తుత తీరానికి సమాంతరంగా ఉండే ఈ తీరం సుమారు 8 వేల సంవత్సరాల క్రితం నాటిదిగా, అది 14 మీటర్ల ఎత్తు ఉన్నట్లుగా గుర్తించారు.

ఈ పురాతన కోస్తా తీరం వద్దనే కొన్ని నదీపాయలను కూడా కనుగొనటమేగాక.. అవి బాహుదా నదికి చెందినవిగా పరిశోధకులు భావిస్తున్నారు. సముద్రంలోగల ఈ పురాతన తీరంపై కొన్ని సముద్రజాతి మొక్కల ఎదుగుదల ఉన్నట్లు గమనించారు. అవి కూడా ఔషధ గుణాలు కలిగినవిగా ఉన్నాయని చెబుతున్నారు. సముద్రంలో తీసిన వీడియోల ద్వారా వీటిపై తాము ఓ నిర్ధారణకు వచ్చామని వారంటున్నారు.

అంతేగాకుండా.. అక్కడ పెరుగుతుండే గార్గోరియన్, సాఫ్ట్ కోరల్స్, స్పాంజెస్ జాతికి చెందిన మొక్కల్ని కూడా సేకరించిన పరిశోధకులు.. అవి కొన్ని రోగ నిరోధక ఔషధాల తయారీలో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అలాగే.. ఎన్ఐఓకు చెందిన సర్వే నౌక ఒకటి సాగర్ సుక్తి గోపాల్‌పూర్ నుండి బారువ వరకు కోస్తా తీరంలో భూభౌతిక సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యింది.

సర్వే నౌక ద్వారా మునిగిపోయిన సముద్ర తీరం ప్రాంతం ఎంతవరకు విస్తరించి ఉంది, అప్పట్లో ఆ ప్రాంతంలో ఏవేవి కాలగర్భంలో కలసిపోయాయి.. తదితర విషయాలను కనుగొనే అవకాశం ఉంది. అంతేగాకుండా, సముద్ర వాతావరణం, దానివల్ల సముద్ర మట్టంలో హెచ్చుతగ్గులు, రానున్న కాలంలో కోస్తా తీరం భవిష్యత్తును సైతం అంచనా వేసేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడనున్నాయి.

ఇక చివరగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. పై పరిశోధనల ద్వారా, వాతావరణంలో మార్పుల వల్ల కోస్తా తీర ప్రాంతానికి ఉన్న ముప్పు, ఈ ప్రభావం నుంచి ఆ తీరాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను శాస్త్రజ్ఞులు విశ్లేషించేందుకు వీలు కలుగుతుంది. అలాగే సముద్ర విజ్ఞానానికి సంబంధించి కొన్ని విశేషాలు కూడా వాటి ద్వారా వెలుగులోకి రాగలవని అందరూ ఆశిస్తున్నారు.