శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2016 (16:35 IST)

ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన సానియా జోడీ: గ్రాండ్‌స్లామ్ చేరువలో.. కేసీఆర్ కితాబు!

ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా- మార్టినా హింగిస్ జోడీ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. మెల్ బోర్న్ పార్కులో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ నెగ్గడంతో సానియా, మార్టినాలు క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్‌కు చేరువయ్యారు. 
 
శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్ పోరులో ఆద్యంతం మెరుగ్గా రాణించిన సానియా జోడీ.. ఏడవ సీడెడ్ క్రీడాకారిణులు ఆండ్రియా హ్లవకోవా- లూసీ హ్రడెకా జోడీని 7-6, 6-3తో మట్టికరిపించింది. దాంతో వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ కైవసం చేసుకున్నట్లైంది. 
 
టెన్నిస్‌లో రాణిస్తున్న తెలంగాణ అంబాసిడర్ సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలుచుకోవడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి, దేశానికి ఎంతో మంచి పేరు తీసుకువచ్చిన సానియా మీర్జా ఇదే జోరు కొనసాగించాలని.. మరిన్ని విజయాలు సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సానియాకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. కాగా ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు కూడా కేసీఆర్ అభినందనలు తెలియజేశారు.